ఆఫ్ఘనిస్తాన్ ఈ రేంజ్లో గెలిస్తే, టీమిండియాకి కష్టాలే... న్యూజిలాండ్తో మ్యాచ్ గెలవకపోతే...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చేతుల్లో ఊహించని షాక్ తగిలింది. దాయాదుల చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది...
తొలి మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, టీ20 వరల్డ్కప్ 2021 గ్రూప్ 2లో ఐదో స్థానంలో నిలిచింది. ఆడింది ఒకే మ్యాచ్ కాబట్టి ఎక్కడున్నా ఏ సమస్యా లేదు...
అయితే భారత జట్టు నెట్రన్ రేట్ -0.973గా ఉండడమే ఇబ్బంది కలిగించే విషయం. మొదటి మ్యాచ్లో క్వాలిఫైయర్స్లో టాపర్గా నిలిచిన స్కాట్లాండ్ను చిత్తు చేసిన ఆఫ్ఘానిస్తాన్, పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లింది.
స్కాట్లాండ్పై ఏకంగా 131 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆఫ్ఘానిస్తాన్ రన్రేట్ ఈ మ్యాచ్ తర్వాత +6.500 కి దూసుకెళ్లింది.. ఈ రేంజ్లో రన్రేట్ను అందుకోవడం ఏ జట్టుకైనా కష్టమే...
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్లో కివీస్ గెలిస్తే భారత జట్టుకి ఎలాంటి నష్టమూ ఉండదు. ఒకవేళ టీమిండియాని ఓడించిన ఉత్సాహంతో పాకిస్తాన్, న్యూజిలాండ్నీ ఓడిస్తే... టీమిండియాకి కష్టాలు తప్పవు..
పాక్ టాప్లో ఉంటే, గ్రూప్లో ఉన్న మిగిలిన నమీబియా, స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుల్లో గెలవడం వారికి పెద్ద కష్టమేమీ కాదు. ఇక న్యూజిలాండ్, ఇండియా మధ్య అసలైన పోటీ ఉంటుంది...
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచే... సెమీస్కి వెళ్లే జట్టుని నిర్ణయించనుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతుల్లో టీమిండియా ఓడితే, ఇక సెమీస్ అవకాశాలు చేజారినట్టే అవుతుంది... పాకిస్తాన్, న్యూజిలాండ్ని ఓడించి, టీమిండియా కూడా కివీస్పై విజయం సాధిస్తే... న్యూజిలాండ్ జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది...
స్కాట్లాండ్పై ఘన విజయాన్ని అందుకున్న ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, భారత్ న్యూజిలాండ్ వంటి జట్లపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూడు జట్లలో ఒక్క టీమ్పై గెలిచినా, ఆఫ్ఘాన్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది..
ఆఫ్ఘాన్, పాకిస్తాన్ని ఓడిస్తే... న్యూజిలాండ్పై టీమిండియా ఓడినా సెమీస్ అవకాశాలు ఉంటాయి. అయితే ఆఫ్ఘాన్తో జరిగే మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది...