సూర్యకుమార్ ఫామ్ మాకు అతిపెద్ద ఆందోళన.. హిట్మ్యాన్ షాకింగ్ కామెంట్స్
Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గతేడాది కాలంగా అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం అతడు విఫలమయ్యాడు.

గత ఏడాది కాలంగా టీ20లలో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. టీమిండియాలో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న సూర్య.. భారత్ ఆడిన గత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో కూడా రాణించాడు. కానీ దక్షిణాఫ్రికాతో మంగళవారం ముగిసిన మూడో టీ20లో 8 పరుగులు మాత్రమే చేశాడు.
మంగళవారం మ్యాచ్ అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇందుకు విరుద్ధంగా సూర్యకుమార్ ఫామ్ తమ జట్టుకు అతిపెద్ద ఆందోళన అని చెప్పడం గమనార్హం.
మ్యాచ్ ముగిశాక మురళీ కార్తీక్ రోహిత్ తో ప్రపంచకప్ కు ముందు టీమిండియా దేనిగురించైనా ఆందోళన చెందుతుందా..? అని ప్రశ్నించాడు. దానికి రోహిత్ మాట్లాడుతూ.. ‘అవును. మేం ఆ విషయాలపై దృష్టి సారించాం. సూర్య ఫామ్ మాకు అతిపెద్ద ఆందోళనగా ఉంది. దాని పై మేం చర్చించుకోవాలి..’ అని ఫన్నీగా చెప్పాడు.
రోహిత్ శర్మ అలా అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అప్పుడు కార్తీక్ కూడా... ‘అసలు టీమిండియాలో అతి తక్కువ ఆందోళన చెందాలసిన విషమమదే కావొచ్చు..’ అని తెలిపాడు. దాంతో హిట్మ్యాన్ మళ్లీ అందుకుని.. ‘లేదు. వాస్తవానికి చెప్పాలంటే మేము మా బౌలింగ్ లోపాలపై దృష్టి సారించాల్సి ఉంది.. పవర్ ప్లే లో మేమింకా ఏం చేయగలం..?
అలాగే మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్లలో లోపాలను సరిదిద్దుకోవడానికి మరేమైనా ఆప్షన్లను వెతకాలో చూస్తాం. గత రెండు సిరీస్ లు చాలా సవాళ్లతో కూడుకున్నవి. రెండు అగ్రశ్రేణి జట్లతో రెండు సిరీస్ లు ఆడాం. అనేక కఠిన సవాళ్లను ఎదుర్కున్నాం. వాటన్నింటికీ మేం సమాధానాలు వెతకాలి. ఆ దిశగా మేం కృషి చేస్తున్నాం.
మేం ఏం చేయాలనేదానిపై జట్టుగా ఇప్పటికే ప్రతిఒక్కరికీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. నా పని కూడా ఆ దిశగా వాళ్లను ప్రోత్సహించడమే..’ అని తెలిపాడు. ఆస్ట్రేలియా పిచ్ లకు అలవాటుపడటానికి రెండు వారాల ముందుగానే అక్కడికి చేరుకుంటాం..’ అని హిట్మ్యాన్ తెలిపాడు.