వార్నర్, బెయిర్ స్టో, కేన్ మామ, రషీద్ ఖాన్... సన్రైజర్స్ టీమ్లో మిస్ అయ్యింది ఇదే....
ఐపీఎల్ 2021 సీజన్లో ఐదు మ్యాచులు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్, ఒకే ఒక్క మ్యాచ్లో విజయం అందుకుంది. మిగిలిన జట్లలో సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ, జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటే, ఆరెంజ్ ఆర్మీలో మాత్రం మనవాళ్లే మైనస్గా మారారు.
కేన్ విలియంసన్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేన్ విలియంసన్, సూపర్ ఓవర్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత కళ్లల్లో నీళ్లు పెట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. తనకి సూపర్ ఓవర్లు అచ్చి రావడం లేదనో లేక అంతసేపు పోరాడి, జట్టుకి విజయం చేకూర్చలేకపోయాననే ఎమోషనల్ అయ్యాడు కేన్ మామ.
బెయిర్ స్టో: సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ సూపర్ ఓవర్లో బౌండరీలు సాధించడానికి ఇబ్బంది పడుతుంటే, డగ్ అవుట్లో బెయిర్ స్టో ఆశ్చర్యపోతూ, ఫీల్ అవ్వడం కనిపించింది. మూడేళ్లుగా సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న బెయిర్ స్టో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడో అర్థం అవుతోంది.
డేవిడ్ వార్నర్: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టునే తన సొంత జట్టుగా భావిస్తాడు డేవిడ్ వార్నర్. జట్టు విజయం కోసం ఎంత చేయాలో అంత చేస్తాడు. జట్టు విజయాలు సాధించలేనప్పుడు డేవిడ్ భాయ్ ఎంత ఫీల్ అవుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రషీద్ ఖాన్: సన్రైజర్స్ హైదరాబాద్లో కీ ప్లేయర్గా మారిన రషీద్ ఖాన్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాడు. ఫీల్డింగ్లో, బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా తన వంతు పాత్ర పర్ఫెక్ట్గా పోషించి, ఎన్నోసార్లు జట్టుకి విజయాన్ని అందించాడు.
భువనేశ్వర్ కుమార్: సన్రైజర్స్ హైదరాబాద్లో కీ ప్లేయర్గా మారిన భువనేశ్వర్ కుమార్, ఆరెంజ్ ఆర్మీలో ఉన్న మ్యాచ్ విన్నర్లలో ఒకడు. అయితే అతన్ని గాయాలు ఇబ్బంది పెడుతుండడంతో గత సీజన్ నుంచి పెద్దగా ఆడడం లేదు భువీ...
సందీప్ శర్మ, నటరాజన్: పెద్దగా స్టార్లు లేకపోయినా చిన్న చిన్న లక్ష్యాలను కూడా రక్షించుకుని చాలా మ్యాచుల్లో విజయాలు అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. దీనికి కారణం రషీద్ ఖాన్, భువీలతో పాటు సందీప్ శర్మ, నటరాజన్ కూడా. అయితే వీరు కూడా గాయాలతో ఇబ్బందిపడుతున్నారు.
ఫారిన్ ప్లేయర్లు అయినా ఈ నలుగురు ప్లేయర్లు విజయం కోసం కసిగా పోరాడినంతగా మనవాళ్లు, స్వదేశీ ప్లేయర్లు పోరాకపోవడమే సన్రైజర్స్ హైదరాబాద్కి అతిపెద్ద మైనస్గా మారింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విరాట్ సింగ్ ఇన్నింగ్స్.
దేశవాళీ లీగ్లో విరాట్ సింగ్కి మంచి రికార్డు ఉంది. 140+ స్ట్రైయిక్ రేటుతో చెలరేగిపోయే విరాట్ సింగ్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 14 బంతులు ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోఎండ్లో కేన్ విలియంసన్ బ్యాటింగ్ చేస్తుంటే, అతనికి స్టైయింగ్ ఇవ్వడానికి కూడా విరాట్ సింగ్కి చేతకాలేదు.
విరాట్ సింగ్తో పాటు కేదార్ జాదవ్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్ అండ్ కో... ఈ బ్యాచ్ అంతటికీ జట్టుతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. ఐపీఎల్ వేలంలో కొనుక్కున్నారు, డబ్బులు వస్తున్నాయి,.... కాబట్టి ఏదో ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అంతే...
వీరిలో మనీశ్ పాండే మాత్రం కాస్త డిఫరెంట్... టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ను వాడుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు మనీశ్ పాండే. అయితే తన ఇన్నింగ్స్లు జట్టుకి ఎంత ఉపయోగపడుతున్నాయనే ఆలోచన మాత్రం పాండేలో కనిపించడం లేదు...
అదీకాకుండా ఖలీల్ అహ్మద్తో పాటు కేదార్ జాదవ్, విజయ్ శంకర్, మనీశ్ పాండే వంటి వాళ్లంతా టీమిండియాకి ఎంపికై, సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక జట్టుకి దూరమైనవాళ్లే. కాబట్టి దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చి మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవాలనే కసి వీరిలో కనిపించడం లేదు...
అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ వంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు జట్టులో ఉన్నా, వారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ ముట్టుకుంటే ఊడిపోతోంది. లేదా బాల్స్ వేస్ట్ చేస్తూ, మ్యాచ్ను చేజార్చుతోంది. ఈ కష్టాలు తీరాలంటే జట్టులో సమూలమైన మార్పులు చేయాల్సిందే.