‘సూర్యుడు పశ్చిమాన ఉదయించొచ్చు గాక.. ఇండియాను వైట్ వాష్ చేయడం ఆసీస్ వల్ల కాని పని..’
Border Gavaskar Trophy: భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మరో రెండ్రోజుల్లో తొలి టెస్టు మొదలుకావాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఈ టెస్టు సిరీస్ ఇరు జట్లకూ చాలా కీలకం.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్ లో గెలిచి వరుసగా నాలుగోసారి ట్రోఫీని నిలుపుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. 2004 నుంచి భారత్ లో భారత్ ను ఓడించలేక తంటాలు పడుతున్న ఆసీస్ ఈసారి ఆ మచ్చను తొలగించుకోవాలని చూస్తున్నది.
భారత్ కు వచ్చీ రాగానే పిచ్ ల మీద పడ్డ ఆస్ట్రేలియన్లు.. తమ మాటలతో పాటు ఆటలో వ్యూహాలకూ పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెటర్లు తమకు తోచిన విధంగా మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. ఈసారి తమ జట్టు బలంగా ఉందని, భారత్ ను భారత్ లో చిత్తుగా ఓడిస్తామని ఎవరికి నచ్చిన విధంగా వారు అంచనాలు కడుతున్నారు.
గిల్క్రిస్ట్, ఇయాన్ హీలి వంటి వారు ఈ ప్రిడిక్షన్స్ లో ముందున్నారు. కొందరు భారత్ ను 1-2 తేడాతో ఓడిస్తామంటే మరికొందరేమో వైట్ వాష్ చేస్తామని చెబుతున్నారు. అయితే భారత్ ను వైట్ వాష్ చేయడం ఆసీస్ వల్ల కాని పని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. జియో సినిమా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో గెలుపోటములు డబ్ల్యూటీసీ ఫైనల్ పై ప్రభావం చూపుతాయి. అందులో సందేహం లేదు. భారత్ ను ఆసీస్ 4-0 తో అంటే వైట్ వాష్ చేస్తే ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమిస్తుంది.
అది జరిగే పనేనా..? ఈ సిరీస్ ను మనం (ఇండియా) 4-0, 3-0, 3-1 తో కాకపోయినా కనీసం 2-1 తో గెలిచినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది. అలా గాక భారత్ వైట్ వాష్ అవడం అనేది అసంభవం. సూర్యుడు తూర్పున కాకుండా పశ్చిమాన ఉదయించొచ్చు గాక.. ఆసీస్ కు మాత్రం అంత సీన్ లేదు..’అని స్పష్టం చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ ల ఈ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో నెగ్గినా మనకు ఫైనల్ బెర్త్ దక్కుతుంది. అలా కాకుండా ఒకవేళ 4-0తో గెలిచి.. శ్రీలంక, న్యూజిలాండ్ ను 2-0తో ఓడిస్తే అప్పుడు ఫైనల్ రేసు నుంచి ఆసీస్ తప్పుకుంటుంది.
అదే జరిగితే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ ను భారత్ - శ్రీలంక మధ్య చూడొచ్చు. అయితే ఎవరు ఫైనల్ చేరతారు..? డబ్ల్యూటీసీ టైటిల్ ను ఎవరు దక్కించుకుంటారు..? అనేది త్వరలోనే తేలనుంది.