డేవిడ్ వార్నర్పై వేటు... అందరి చూపు విరాట్ కోహ్లీపైనే... ఈసారి కప్ గెలవకపోతే...
ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పర్ఫామెన్స్పై సంతృప్తి చెందని టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ డేవిడ్ వార్నర్పై వేటు వేసింది. కొత్త కెప్టెన్గా కేన్ విలియంసన్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం అందరి చూపు విరాట్ కోహ్లీవైపు మళ్లీంది...
డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016 సీజన్లో టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్, 2017, 2019, 20 సీజన్లలో ఫ్లేఆఫ్కి కూడా చేర్చాడు. కేవలం 2021 సీజన్లో ఫస్ట్ హాఫ్ పర్ఫామెన్స్ బాగోలేదని వార్నర్పై వేటు వేసింది ఆరెంజ్ ఆర్మీ.
వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ పర్ఫామెన్స్ మరీ అంత ఘోరంగా కూడా ఏమీ లేదు. 6 మ్యాచుల్లో193 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, రెండు మ్యాచుల్లో బెయిర్ స్టోతో కలిసి ఒంటరి పోరాటం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో బెయిర్ స్టోను పంపకుండా, తాను స్వయంగా బ్యాటింగ్కి రావడం... అందులోనూ దురదృష్టవశాత్తు వార్నర్ తీసిన పరుగు షార్ట్ రన్ కావడం, అది మ్యాచ్ రిజల్ట్పై ప్రభావం చూపడం... జరిగిపోయాయి...
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్ మీద నమ్మకం లేక... నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు డేవిడ్ వార్నర్. ఇదే మ్యాచ్ రిజల్ట్ మారిపోవడానికి కారణమైంది. మ్యాచ్ అనంతరం ఓటమికి బాధ్యత వహిస్తున్నానంటూ కూడా ఒప్పుకున్నాడు వార్నర్ భాయ్.
జట్టు కోసం ఇంత చేసి, ఒక టైటిల్ కూడా అందించిన డేవిడ్ వార్నర్పై ఉద్వాసన వేటు వేయడంతో ఇప్పుడు విరాట్ కోహ్లీవైపు అందరి చూపు మళ్లింది. వార్నర్ భాయ్ ఐదేళ్లలో ఓ టైటిల్ గెలిస్తే, విరాట్ కోహ్లీ 8 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2015లో ప్లేఆఫ్కి అర్హత సాధించిన ఆర్సీబీ, 2016లో ఫైనల్ చేరి వార్నర్ కెప్టెన్సీలోని సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోనే ఓడింది... ఆ తర్వాత మూడు సీజన్లు ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది.
గత సీజన్లో మొదటి 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. 2020 సీజన్లోనూ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ చేతుల్లోనే ఓడింది ఆర్సీబీ.
ఐపీఎల్లో అత్యధిక మొత్తం తీసుకుంటున్న ప్లేయర్గా నిలిచిన విరాట్ కోహ్లీ జట్టు కోసం చేయాల్సిదంతా చేస్తున్నాడు. అయితే ఐపీఎల్ టైటిల్ మాత్రం గెలవలేకపోతున్నాడు. సీజన్లు మారుతున్నా, ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు.
ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు జెర్సీ మారుతోంది. జట్టులో ప్లేయర్లు మారుతున్నారు. వేలంలో కోట్లు పెట్టి విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం మారడం లేదు..
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి నాలుగు మ్యాచుల్లో గెలిచి, అభిమానుల్లో ఆశలు రేపిన ఆర్సీబీ... ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి... పాత జట్టును గుర్తుకుతెచ్చింది..
ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది 9వ సీజన్... ఈసారి కూడా టైటిల్ గెలవలేకపోతే, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే అవకాశం ఉంది.
ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టైటిల్ తేవాలని విరాట్ కోహ్లీ ఎంతో కష్టపడుతున్నాడు. ఇంకా తనని తాను కష్టపెట్టుకునేందుకు విరాట్ కోహ్లీ సాహసించకపోవచ్చు. అభిమానులు కూడా ఇంకా ఎంతకాలమని వేచి చూడగలరు...