సౌరవ్ గంగూలీలో ఇంకా దూకుడు తగ్గలేదు... 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది...
బీసీసీఐ బోర్డు మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్ టాలెంట్ను మరోసారి రుచి చూపించాడు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో సౌరవ్ గంగూలీ ఎలెవన్, బీసీసీఐ సెక్రటరీ జై షా జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జై షా జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.
జై షా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేయగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.
మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన సౌరవ్ గంగూలీ 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు..
124 పరుగుల లక్ష్యచేధనతో బ్యాటింగ్ ప్రారంభించిన గంగూలీ ఎలెవన్ జట్టు... నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేయగలిగింది...
కెప్టెన్ సౌరవ్ గంగూలీ 32 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 53 పరుగులు చేసి, 48 ఏళ్ల వయసులోనూ తన బ్యాటింగ్ టాలెంట్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.
అయితే 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జై షా.. 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు...
గంగూలీ మినహా మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో 28 పరుగుల తేడాతో ఓడింది సౌరవ్ గంగూలీ ఎలెవన్ జట్టు.
అహ్మదాబాద్లో గురువారం డిసెంబర్ 24న బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో ఐపీఎల్ 2021తో పాటు వచ్చే టీ20 వరల్డ్కప్ నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.
2021 ఐపీఎల్లో అదనంగా చేరే జట్ల విషయంపై ఈ మీటింగ్ అనంతరం స్పష్టత రానుంది. 2021 సీజన్కి పెద్దగా సమయం లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి బదులుగా మినీ వేలంతో సరిపెట్టనున్నట్టు సమాచారం.