రహానేకు వైస్ కెప్టెన్సీ ఏంటి..? ఇదేం లాజిక్..? బీసీసీఐ మాజీ చీఫ్ దాదా కామెంట్స్
Sourav Ganguly: 18 నెలల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. ఒక్క మ్యాచ్ లో రాణించడంతోనే భారత సెలక్టర్లు తిరిగి రహానేకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.

టీమిండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా తొలుత రెండు టెస్టులు ఆడనుంది. అయితే ఈ టూర్ కు ఇటీవలే ఎంపిక చేసిన టెస్టు జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండగా అతడికి డిప్యూటీగా అజింక్యా రహానేను నియమించింది బీసీసీఐ.
18 నెలల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్ లో రహానే రెండు ఇన్నింగ్స్ లలో 89, 46 పరుగులు సాధించాడు. ఒక్క మ్యాచ్ లో రాణించడంతోనే భారత సెలక్టర్లు తిరిగి రహానేకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.
రహానేకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. అసలు 18 నెలలుగా టీమ్ లో లేని క్రికెటర్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఉన్నలాజిక్ తనకు అయితే అర్థం కావడం లేదని దాదా చెప్పాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘ఫామ్ కోల్పోయి 18 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన రహానేను వైస్ కెప్టెన్ ను చేశారు. ఇది వెనుకడుగు వేసినట్టు అయితే కాదు. చాలా కాలం తర్వాత ఒకే ఒక టెస్టు ఆడి వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. అయితే దీని వెనకాల లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడంలేదు.
రహానేకు కాకుండా టీమ్ లో నిలకడగా రాణిస్తున్న మరో ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుండేది. రవీంద్ర జడేజా చాలాకాలంగా టీమ్ లో నిలకడగా ఆడుతున్నాడు. అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్తే బాగుండేది. జడ్డూ ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాడు. టీమ్ సెలక్షన్ విధానంలో నిలకడ, కొనసాగింపు అవసరం’అని చెప్పాడు.
ఇక పుజారాను తప్పించడంపై కూడా గంగూలీ స్పందించాడు. పుజారా వంటి మేటి క్రికెటర్ ను ఓ టెస్టులో బాగా ఆడాడని తీసుకోవడం, మరో టెస్టులో బాగా ఆడలేదని తీసేయడం సరికాదని దాదా అన్నాడు. పుజారాను కొనసాగిస్తారా..? లేక అతడి స్థానంలో మరో కొత్త ఆటగాడిని ఎవరినైనా తీర్చిదిద్దుతున్నారా..? అన్నవిషయంలో సెలక్టర్లకు క్లారిటీ ఉండాలని గంగూలీ చెప్పాడు.