Sanju Samson: నిన్న మిస్ అయ్యా.. కానీ త్వరలోనే సాధిస్తా.. : శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IND vs IRE: ఇండియా-ఐర్లాండ్ మధ్య మంగళవారం ముగిసిన టీ20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు.
Sanju Samson
లంకతో సిరీస్ తర్వాత ఐపీఎల్ లో రాణించినా దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశం దక్కించుకోని సంజూ శాంసన్.. తిరిగి ఐర్లాండ్ తో సిరీస్ లో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఐర్లాండ్ తో సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్ లో శాంసన్ ను ఆడించారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు.
ఐర్లాండ్ తో మ్యాచ్ లో అతడు 44 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఇందులో 9 బౌండరీలు 4 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో దీపక్ హుడాతో పాటు సెంచరీ దిశగా సాగుతున్న శాంసన్.. అనూహ్యంగా ఔటయ్యాడు.
అయితే అతడు సెంచరీ కోల్పోయినందుకు గాను శాంసన్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడు శాంసన్ తో మాట్లాడుతూ.. ‘నువ్వు సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది..’ అని చెప్పాడు.
దీనికి శాంసన్ బదులిస్తూ.. ‘ఇది చాలా మంచి గేమ్. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో నాది దీపక్ హుడాల మధ్య భాగస్వామ్యం కీలకమైంది. నేను క్రీజులో కాస్త ఇబ్బందులు పడుతుంటే హుడా మాత్రం రెచ్చిపోయాడు.
అతడిని చూశాక నేను కూడా హుడాను అనుసరించాను. ఇక హుడా రెచ్చిపోతున్నప్పుడు నేను అతడికే స్ట్రైక్ ఇచ్చాను. ఇక నేను కూడా హిట్టింగ్ కు దిగినప్పుడు అతడు కూడా అలాగే చేశాడు. హుడా సెంచరీ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
రాబోయే మ్యాచులలో నేను కూడా సెంచరీ సాధిస్తాను. కానీ ఈ మ్యాచ్ లో నేను ఆడినదానికి మాత్రం చాలా హ్యపీగా ఫీల్ అయ్యాను..’అని తెలిపాడు. అజయ్ జడేజా తనను పొగిడినందుకు గాను శాంసన్ అతడికి కృతజ్ఞతలు తెలిపాడు.