ఆరుగురు పాక్ క్రికెటర్లకి కరోనా పాజిటివ్... ఇద్దరికి ఎప్పటినుంచో... న్యూజిలాండ్తో సిరీస్కి ముందు...
ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో హడావుడిగా పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్తో సిరీస్ కోసం కివీస్ గడ్డపై అడుగుపెట్టిన ఆరుగురు పాక్ క్రికెటర్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పీఎస్ఎల్ ఆడిన మిగిలిన దేశాల క్రికెటర్లలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూజిలాండ్తో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డపై అడుగుపెట్టిన పాక్ క్రికెట్ టీమ్ క్రిస్ట్చర్చిలో కరోనా పరీక్షలు నిర్వహించారు...
ఈ పరీక్షల్లో ఆరుగురు పాక్ క్రికెటర్లకి పాజిటివ్గా వచ్చింది. దీంతో క్రిస్ట్చర్చిలోనే వీరికి ఐసోలేషన్ ఏర్పాటు చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు...
కరోనా సోకిన ఆరుగురు క్రికెటర్లలో ఇద్దరికి ఎప్పటినుంచో కోవిద్-19 ఉన్నట్టు తేల్చారు వైద్యులు. మిగిలిన నలుగురికి కొత్తగా కరోనా సోకినట్టు నివేదికలో తెలిపారు... దీంతో పీఎస్ఎల్ ఆడిన ప్లేయర్లు షాక్కు గురయ్యారు.
న్యూజిలాండ్ చేరిన క్రికెట్ టీమ్లో కరోనా సోకిన ప్లేయర్ల కోసం ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్ ఏర్పాటు చేసింది న్యూజిలాండ్. వీరికి కరోనా సోకడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
‘పాక్ ప్లేయర్లలో కొందరు మొదటిరోజే ప్రొటోకాల్ను తప్పించి, తమ ఇష్టానుసారం వ్యవహారించారు. వారికి కూడా అవసరమైన ఐసోలేషన్ ఏర్పాటుచేశాం...’ అని చెప్పుకొచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.
పాకిస్థాన్, ఈ పర్యటనలో న్యూజిలాండ్తో కలిసి మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 18 నుంచి టీ20 సిరీస్ మొదలు కానుంది.
ఐపీఎల్ ఆడిన డుప్లిసిస్తో పాటు విండీస్ ప్లేయర్ రూథర్డ్ఫర్డ్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ ముగియగానే పీఎస్ఎల్ కోసం పాకిస్థాన్కి పయనమయ్యారు...
ఐపీఎల్లో గడిపిన బయో బబుల్ జీవితం తర్వాత పీఎస్ఎల్లో క్రికెట్ ఆడారు. ఇప్పుడు పాక్ క్రికెటర్లలో ఆరుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పాక్ సూపర్ లీగ్లో మిగిలిన క్రికెటర్లకి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు... దుబాయ్లో బయో బబుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించిన బీసీసీఐని చూసి పాకిస్థాన్, పీఎస్ఎల్ నిర్వహిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు నెటిజన్లు.