IPL 2026 : మంట పుట్టిస్తున్న ఐపీఎల్ అప్డేట్.. డేట్ మారింది.. హోం గ్రౌండ్స్ మారుతున్నాయి
IPL schedule update : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేసిన బీసీసీఐ, ఆర్సీబీ హోమ్ మ్యాచ్ల విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్: ప్రారంభ తేదీ మారింది.. కొత్త షెడ్యూల్ ఇదే
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అయితే, గతంలో అనుకున్న తేదీ కంటే రెండు రోజులు ఆలస్యంగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న ముగియనుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, గవేర్నింగ్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మార్చి 26న ప్రారంభించాలని భావించినప్పటికీ, వీకెండ్ లో టోర్నీని ఘనంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ జాప్యం
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడమే ఐపీఎల్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం. కోల్కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల హోమ్ మ్యాచ్లు ఆయా రాష్ట్రాల్లోనే జరగాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తన రెండో హోమ్ గ్రౌండ్గా అస్సాంలోని గువహటిని ఎంచుకుంది. ఎన్నికల తేదీలతో మ్యాచ్లు క్లాష్ అవ్వకుండా చూడాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే గత ఎన్నికల సమయాల్లో చేసినట్లుగానే, ఈసారి కూడా షెడ్యూల్ను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
ఆర్సీబీ హోమ్ మ్యాచ్లపై అనిశ్చితి
ప్రస్తుత ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. నిబంధనల ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలోనే ప్రారంభ మ్యాచ్ జరగాలి. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత జూన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన సందర్భంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భద్రతా కారణాల దృష్ట్యా, ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లను బెంగళూరు వెలుపల నిర్వహించే ఆలోచనలో ఉంది.
ఆర్సీబీ హోం గ్రౌండ్: ప్రత్యామ్నాయాలు పరిశీలన
బెంగళూరుకు బదులుగా నవీ ముంబై, రాయ్పూర్ లేదా పుణే నగరాలను ఆర్సీబీ హోమ్ మ్యాచ్ల కోసం బీసీసీఐ పరిశీలిస్తోంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇప్పటికే ఈ విషయంలో చర్చలు జరిపాయి. చిన్నస్వామి స్టేడియంలోనే ఆడాలా లేక ఇతర ప్రాంతాలకు మారాలా అనే దానిపై వచ్చే వారం జరగనున్న గవేర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలిసారి కప్పు అందుకున్న సంగతి తెలిసిందే.
సంజూ శాంసన్ కొత్త ఇన్నింగ్స్
ఈసారి ఐపీఎల్ సీజన్ లో చాలా ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్నాళ్లూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గూటికి చేరాడు. సీఎస్కే జెర్సీలో సంజూ కనిపించనుండటంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు అబుదాబిలో జరిగిన వేలంలో జట్లు తమ కూర్పును మార్చుకోవడంతో, 2026 సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. వచ్చే వారంలో షెడ్యూల్ తొలి భాగం విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

