Shreyas Iyer: సైలెంట్ హీరో కాదు.. భారత జట్టు ఛాంపియన్ హీరో !
Shreyas Iyer: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ తన 48 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టు విజయంలో కీలకంగా ఉంది.

Image Credit: Getty Images
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్.. సైలెంట్ హీరో.. నిజమే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్టు అతను సైలెంట్ గా ఉంటూనే భారత్ కు అద్భుతమైన విజయాలు అందించే ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐసీసీ టోర్నమెంట్లో వరుసగా రెండోసారి భారత జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తూ సైలెంట్ హీరోనే కాదు.. పరుగుల హీరోగా నిరూపించుకున్నాడు. ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్లో భారతదేశం తరపున అత్యుత్తమ నంబర్ 4 బ్యాట్స్మెన్లో ఒకరిగా శ్రేయాస్ అయ్యర్ గుర్తింపు సాధించాడు.
2023 ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, అతను 11 మ్యాచ్ల్లో 530 పరుగులు చేశాడు. 50 ఓవర్ల టోర్నమెంట్లో ఒక ఎడిషన్లో భారతీయ నంబర్ 4 ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇది. అయ్యర్ ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు . అతను ఐదు ఇన్నింగ్స్లలో 243 పరుగులు చేయడంతో భారత తన జైత్రయాత్రను కొనసాగిస్తూ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరవేసింది.
శ్రేయాస్ అయ్యర్ 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక ప్లేయర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 5 ఇన్నింగ్స్లలో 243 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, రెండు 40 ప్లస్ పరుగుల ఇన్నింగ్స్ లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా శ్రేయాస్ అయ్యరే.
ఫైనల్లో భారత్ 30/3 పరుగులతో కష్టాల్లో ఉన్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో కీలకమైన 48 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ అతని స్థానం గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం శ్రేయాస్ అయ్యర్ భారత్ విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాడో తెలియజేస్తుంది.
Image Credit: Getty Images
తనపై వస్తున్న ప్రశంసల గురించి శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ సంతోషంగా ఉందని తెలిపాడు. కొన్ని సార్లు తగిన గౌరవం, గుర్తింపు రాకపోయినా.. తన పనిపట్ల సంతృప్తిగా ఉంటుందని చెప్పాడు. వైట్-బాల్ క్రికెట్లో మరో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, అయ్యర్ ఇప్పుడు భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్ సమయంలో అతన్ని జట్టు నుండి తొలగించారు. 2024/25 రంజీ ట్రోఫీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ తిరిగి జట్టులోకి తీసుకోలేదు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రికార్డుల మోత మోగించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయాస్ అయ్యర్ 5 మ్యాచ్లు ఆడాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లు బంగ్లాదేశ్ పై 15 పరుగులు, పాకిస్తాన్ పై 56 పరుగులు, న్యూజిలాండ్ పై 79 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు. ఇక సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 45 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఫైనల్ పోరులో న్యూజిలాండ్ పై 48 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. మొత్తంగా శ్రేయాస్ అయ్యర్ తన వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 70 మ్యాచ్ లను ఆడి 2845 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. మరోసారి ఐసీసీ టోర్నమెంట్ లో సైలెంట్ గా ఉంటూనే పరుగులు రాబడుతూ.. భారత్ విజయాలు అందించే హీరోగా మరోసారి నిరూపించుకున్నాడు.