సఫాలీ వర్మ సిక్సర్ల మోత... రాజేశ్వరి రికార్డు స్పెల్... ఆఖరి టీ20లో టీమిండియా ఘనవిజయం...
సౌతాఫ్రికా చేతుల్లో వన్డే సిరీస్, టీ20 కోల్పోయిన తర్వాత ఆఖరి టీ20 మ్యాచ్లో భారత మహిళా జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చి, మంచి విజయం అందుకుంది... బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దుమ్ముదులిపి, పరువు నిలబెట్టుకుంది...
టీ20 సిరీస్లో మొట్టమొదటిసారి టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ సెన్సేషనల్ స్పెల్ కారణంగా 20 ఓవర్లలో 112 పరుగులే చేయగలిగింది దక్షిణాఫ్రికా...
మంచి ఫామ్లో ఉన్న లిజెల్లీ లీని 12 పరుగుల వద్ద బౌల్డ్ చేసిన రాజేశ్వరి, అన్నే బోస్చ్ని డకౌట్ చేసింది. గత మ్యాచ్లో అదరగొట్టిన లౌరా వోల్వరెట్ డకౌట్ అయ్యింది...
28 పరుగులు చేసిన కెప్టెన్ సునీ లూస్ను దీప్తి శర్మ అవుట్ చేయగా 18 పరుగులు చేసిన టున్నిలిఫ్ను సిమ్రాన్, నిడెన్ను రాజేశ్వరి, సినాలే జప్టను అరుంధతి రెడ్డి అవుట్ చేశారు...
113 పరుగుల టార్గెట్ను 11 ఓవర్లలోనే ఊదేసింది టీమిండియా. ఐసీసీ టీ20 నెం.1 వుమెన్ ప్లేయర్ 17 ఏళ్ల సఫాలీ వర్మ సిక్సర్లు, బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది...
30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసిన సఫాలీ వర్మ... స్వదేశంలో తొలి హాఫ్ సెంచరీ నమోదుచేసి అవుటైంది...
ఓ వైపు సఫారీ సిక్సర్ల మోత మోగిస్తుంటే... మరో ఎండ్లో అద్భుతమైన ఫోర్లతో 28 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసిన స్మృతి మంధాన, విజయాన్ని పూర్తి చేసింది...
4 ఓవర్లు బౌలింగ్ చేసిన రాజేశ్వరీ గైక్వాడ్... 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. 17 ఏళ్ల సఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కడం విశేషం.