- Home
- Sports
- Cricket
- టీమిండియా హెడ్ కోచ్ వర్సెస్ కెప్టెన్... న్యూజిలాండ్తో మ్యాచ్ ఓటమి తర్వాత మరోసారి తెరపైకి...
టీమిండియా హెడ్ కోచ్ వర్సెస్ కెప్టెన్... న్యూజిలాండ్తో మ్యాచ్ ఓటమి తర్వాత మరోసారి తెరపైకి...
టీ20 వరల్డ్ కప్ 2020 నాటి సంగతి... భారత టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్కి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై తీవ్ర దుమారం రేగింది. మిథాలీ రాజ్ వేగంగా ఆడదని, స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉంటోందని అప్పటి హెడ్ కోచ్ రమేశ్ పవార్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి...

స్ట్రైయిక్ రేటు గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. దీంతో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది మిథాలీ రాజ్...
మళ్లీ 2022 వన్డే వరల్డ్ కప్ టోర్నీలోనూ ఇదే డిస్కర్షన్ తెరపైకి వచ్చింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 107 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది భారత జట్టు...
అయితే న్యూజిలాండ్తో జరిగిన రెండో మ్యాచ్లో 62 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా. భారత బౌలర్లు అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చి ఆతిథ్య న్యూజిలాండ్ను 260 పరుగులకే కట్టడి చేసినా, ఆ లక్ష్యాన్ని చేరుకోలేక 198 పరుగులకి చతికిలపడింది టీమిండియా...
స్మృతి మంధాన 21 బంతుల్లో 6 పరుగులు చేసి అవుటైన తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. కెప్టెన్ మిథాలీరాజ్, దీప్తి శర్మ తీవ్రంగా నిరాశపరిచారు...
వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి కాస్త ఆశలు రేపినా, ఆమెకు అవతలి ఎండ్ నుంచి సరైన సపోర్ట్ దొరకలేదు...
యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మకు ఓపెనర్గా చోటు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దూకుడుగా ఆడే షెఫాలీకి ఓపెనర్గా చోటు ఇస్తే, భారీ లక్ష్యాలు ఛేదించడం తేలికవుతుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం...
అయితే షెఫాలీ వర్మ కొన్నిరోజులుగా సరైన ఫామ్లో లేకపోవడంతో యషికా భాటియాని ఓపెనర్గా పంపుతోంది భారత టీమ్ మేనేజ్మెంట్. ఇది పెద్దగా వర్కవుట్ కావడం లేదు...
‘న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియాకి ఏదీ కలిసి రాలేదు. కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది. అయితే మొదటి 20 ఓవర్లు భారత బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయా...
సింగిల్స్ తీసుకోవడానికి కూడా టీమిండియా బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. సీనియర్లు మిథాలీ, స్మృతి, జులన్లు బాధ్యత తీసుకోవాలి. ఒంటిచేత్తో విజయాలు అందించగలగాలి...
సీనియర్లే విఫలం అయితే పెద్దగా అనుభవం లేని జూనియర్ ప్లేయర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.. ఆరు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. కాబట్టి వంకలు చెప్పడం మానేయండి...’ అంటూ కామెంట్ చేశాడు మహిళా టీమ్ హెడ్ కోచ్ రమేశ్ పవార్...
రమేశ్ పవార్ కామెంట్లతో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్కి, హెడ్ కోచ్కి మధ్య మరోసారి విభేదాలు వచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతోంది...
39 ఏళ్ల మిథాలీ రాజ్, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా మిథాలీ రాజ్ నుంచి తన రేంజ్ పర్ఫామెన్స్ రాలేదు...
శనివారం వెస్టిండీస్ జట్టుతో తలబడుతోంది భారత జట్టు. వరుస విజయాలతో జోరు మీదున్న వెస్టిండీస్ను ఓడించాలంటే భారత జట్టు శాయశక్తులా శ్రమించాల్సి ఉంటుంది...