సచిన్, సెహ్వాగ్, ధోనీ, ఇంజామామ్ వుల్ హక్... బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీకి వచ్చిన దరఖాస్తుల్లో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో పాటు నలుగురు సెలక్షన్ కమిటీ సభ్యులపై వేటు వేసింది భారత క్రికెట్ బోర్డు... త్వరలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది.
చీఫ్ సెలక్టర్తో పాటు నలుగురు సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. ఐదు పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తే 600లకు అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. సెలక్షన్ ప్యానెల్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులకు షాక్ తగిలిందట..
భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లతో సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లే అనుకుంటే పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ పేరు కూడా దరఖాస్తుల్లో ఉండడం విశేషం...
సచిన్, సెహ్వాగ్, ధోనీ అంటే భారత మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐ సెలక్టర్ జాబ్ కోసం అప్లై చేశారేమో అనుకోవచ్చు కానీ ఇంజమామ్ వుల్ హక్... మనదేశం వాడు కూడా కాదు. అందులోనూ శత్రుదేశంగా భావించే పాక్ మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్టర్ పోస్టుకి ఎందుకు అప్లై చేస్తాడు?
Image credit: PTI
‘సెలక్షన్ ప్యానెల్ కోసం 600లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో సచిన్, ధోనీ, సెహ్వాగ్ పేరుతో ఫేక్ ఐడీల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి పనుల వల్ల బీసీసీఐ టైమ్ వేస్ట్ అవుతోంది.. క్రికెట్ అడ్వైసరీ కమిటీ, 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి, ఐదుగురిని సెలక్ట్ చేస్తుంది.. త్వరలోనే కొత్త సెలక్షన్ ప్యానెల్ని ఎంపిక చేస్తాం..’ అంటూ చెప్పుకొచ్చారు బీసీసీఐ అధికారులు...
చేతన్ శర్మ కమిటీపై వేటు వేసినా, కొత్త సెలక్షన్ ప్యానెల్ ఏర్పాటు అయ్యేవరకూ వాళ్లే సెలక్షన్ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తారు. డిసెంబర్ 21న సమావేశమయ్యే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్, సెలక్షన్ కమిటీతో పాటు ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంపై నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ..
Venkatesh Prasad
భారత మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్... బీసీసీఐ చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరిలో సీనియర్ అయిన వెంకటేశ్ ప్రసాద్ని చీఫ్ సెలక్టర్గా నియమించి, అజిత్ అగార్కర్కి ప్యానెల్ సభ్యుడిగా చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినబడుతోంది..