- Home
- Sports
- Cricket
- పింఛన్తో బతుకీడుస్తున్నా.. సచిన్కు అన్నీ తెలుసు, అయినా! టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ సంచలన వ్యాఖ్యలు
పింఛన్తో బతుకీడుస్తున్నా.. సచిన్కు అన్నీ తెలుసు, అయినా! టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ సంచలన వ్యాఖ్యలు
Vinod Kambli: 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ తర్వాత పలు కారణాలతో జట్టు నుంచి దూరమయ్యాడు. ఇప్పుడు కాంబ్లీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు.

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచర ఆటగాడు, అతడి చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లీ గుర్తున్నాడా..? అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే కాంబ్లీ.. ఇప్పుడు తాను గడుపుతున్న దుర్భర జీవితానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ ఇచ్చే పింఛనే తన జీవనాధారమని, అదే తన కుటుంబాన్ని పోషిస్తున్నదని కాంబ్లీ వాపోయాడు. క్రికెట్ కు సంబంధించిన ఏ పనైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఏదైనా పనుంటే ఇప్పించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ను వేడుకున్నాడు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ కాంబ్లీ మాట్లాడుతూ.. ‘నేను రిటైర్ క్రికెటర్ను. కేవలం బీసీసీఐ ఇచ్చే పింఛన్ (రూ. 30 వేలు) మీదే ఆధారపడాల్సి వస్తుంది. నాకొచ్చే ఆదాయం అదొక్కటే. ఇందుకు గాను నేను బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..
నాకు ముంబై క్రికెట్ చాలా ఇచ్చింది. నాకెంతో ఇచ్చిన ఎంసీఏ కు నేను క్రికెట్ కు సంబంధించిన ఏం పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎంసీఏ చొరవ తీసుకుని నాకు వాంఖెడే లో గానీ బీకేసీ లో గానీ ఏదైనా పని ఉంటే ఇప్పిస్తే దాంతో నేను నా కుటుంబాన్ని పోషించుకుంటా...’అని అభ్యర్థించాడు.
90వ దశకంలో సచిన్ సహచరుడిగా ఉన్న కాంబ్లీతో అతడికి మంచి స్నేహం ఉంది. అయితే తన ఆర్థిక పరిస్థితి సచిన్ కు తెలుసా..? అన్న ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. ‘సచిన్ కు అన్నీ తెలుసు. గతంలో నేను టెండూల్కర్ క్రికెట్ అకాడమీ లో యువ క్రికెటర్లకు మెంటార్ గా ఉండేవాడిని. కానీ అది నేను ఉండే ప్రాంతానికి చాలా దూరం కావడంతో అక్కడ ఉద్యోగం మానేశాను..
సచిన్ కు నా గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు వెళ్లి అడిగినా సచిన్ నాకు సాయం చేస్తాడు. కానీ నేను అడగను. ఇప్పటికే సచిన్ నాకు చాలా సాయం చేశాడు. తన అకాదమీలో నాకు ఉద్యోగం ఇప్పించాడు. నా బాగు కోరేవారిలో సచిన్ ఎప్పుడూ ముందుంటాడు..’అని అన్నాడు.
ఎంసీఏ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అడగ్గా.. ‘నేను యువ క్రికెటర్లతో పనిచేయాలనుకుంటున్నా. నా అనుభవం వాళ్లకు ఉపయోగపడితే అది మంచిదే కదా. ముంబై క్రికెట్ జట్టుకు ఇప్పుడు అమోల్ మజుందార్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. కానీ ఒకవేళ నేను కావాల్సి వస్తే అందుకు నేను సిద్ధంగా ఉన్నా.
ఎంసీఏ నన్ను క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీ (సీఏసీ)లోకి తీసుకుంది. అదొక గౌరవప్రదమైన ఉద్యోగం. అంతేగానీ అక్కడ పనిచేసినందుకు జీతమేమీ ఇవ్వరు. అదే విషయం నేను ముంబై క్రికెట్ తో చాలాసార్లు చెప్పాను. మరో విధంగా ఎంసీఏ నన్ను ఆదుకుంటే నా కుటుంబాన్ని పోషించుకుంటా..’ అని అంటున్నాడు కాంబ్లీ.
టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 3,500 కు పైగా పరుగులు చేశాడు. టెస్టులలో 4 సెంచరీలు, వన్డేలలో 2 శతకాలు బాదాడు. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన కాంబ్లీ తర్వాత పలు వివాదాలతో జట్టు నుంచి దూరమయ్యాడు. ఆ తర్వాత ముంబై జట్టుకు ఆడినా ఆర్థికంగా స్థిరపడలేదు.