రూమర్లది ఏముంది.. ముందు నువ్వు కోలుకో.. పంత్కు ఊర్వశి రౌతేలా తల్లి విషెస్.. అల్లుడు అనడం మరిచిపోయారంటూ..
Rishabh Pant Accident: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని అతడి ఫ్యాన్స్ తో పాటు క్రికెటర్లు, మాజీలు కోరుతున్నారు. తాజాగా..
గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పంత్ ఆరోగ్యం త్వరితగతిన మెరుగుపడాలని అతడి అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ మాజీ ప్రేయసి (?) ఊర్వశి రౌతేలా తల్లి కూడా స్పందించింది.
సోషల్ మీడియా వేదికగా ఊర్వశి తల్లి మీరా రౌతేలా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా పంత్ ఫోటోను షేర్ చేస్తూ .. ‘సోషల్ మీడియాలో రూమర్స్ (ఊర్వశి-పంత్ ప్రేమలో ఉండి కొంతకాలం తర్వాత విభేదాల కారణంగా విడిపోయారని) ఒకవైపు.
నువ్వు మళ్లీ కోలుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం, ఉత్తరాఖండ్ పేరును నలుదిశలా మరోవైపు.. అందరూ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి..’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మీరా ఈ పోస్టు పెట్టిన తర్వాత పలువురు నెటిజన్లు.. ‘అయ్యో, మీరు అల్లుడు అనడం మరిచిపోయారు...’, ‘పంత్ భయ్యా, నీకు అత్త ఆశీర్వాదం కూడా వచ్చింది. ఇక నువ్వు త్వరలోనే కోలుకుంటావు. తిరిగి జట్టుతో చేరతావు..’అని కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఫ్యామిలీ ఫ్యామిలీ పంత్ వెనుకే పడ్డారా..?’ అని ఫన్నీగా ట్రోల్ చేశాడు.
ఇదిలాఉండగా పంత్ రోడ్డు ప్రమాదంపై సోమవారం భారత దిగ్గజం కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘మీ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. చాలా హైస్పీడ్ తో దూసుకెళ్తాయి. కానీ మీరు (పంత్ ప్రమాదం నేపథ్యంలో అతడిని ఉద్దేశిస్తూ) జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ ను పెట్టుకునే స్థోమత ఉంది. కావున ఎప్పుడూ ఒంటరిగా డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ మీద ఆసక్తో లేక వాళ్లకున్న అభిరుచితోనో చాలా మంది సొంతగా డ్రైవింగ్ చేస్తుంటారు. వయసురీత్యా అది సహజమే. కానీ మనం బాధ్యతలను కూడా గుర్తెరగాలి. వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి...’ అని చెప్పాడు.
తాను కూడా యుక్త వయసులో ఉండగా ఇలాగే ఓసారి ప్రమాదానికి గురయ్యానని, కానీ ఆ తర్వాత బండిని ముట్టుకోలేదని తెలిపాడు. ‘నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నాకూ బైక్ యాక్సిడెంట్ అయింది. అప్పట్నుంచి మా సోదరుడు నన్ను బండిని ముట్టుకోనీయలేదు..’అని అన్నాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ కు ఇన్ఫెక్షన్లు సోకకుండా సోమవారం ప్రైవేట్ వార్డ్ కు తరలించారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పంత్ కు ఇన్ఫెక్షన్స్ రాకుండా అతడికి ప్రైవేట్ వార్డుకు మార్చినట్టు మ్యాక్స్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ స్పందిస్తూ.. ‘పంత్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అతడిని ఆదివారం సాయంత్రం ప్రైవేట్ వార్డ్ కు మార్చారు.. పూర్తిగా కోలుకునేదాకా అతడు అక్కడే ఉంటాడు..’అని చెప్పాడు.