ఓ ప్లానూ లేదు... ఓ స్ట్రాటెజీ లేదు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంపై ట్రోలింగ్...
ఆటలో విజయం సాధించాలంటే మంచి ప్లేయర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకుంటూ, ప్రత్యర్థిపై విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. 13 సీజన్లుగా టైటిల్ సాధించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి వేలంలోనూ ఎలాంటి స్ట్రాటెజీ లేకుండా బరిలో దిగినట్టు కనిపించింది.
ఐపీఎల్ మినీ వేలానికి 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మిగిలిన జట్లతో పోలిస్తే ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, శివమ్ దూబే, ఉమేశ్ యాదవ్, క్రిస్ మోరిస్ వంటి ప్లేయర్లను వేలానికి విడుదల చేసింది ఆర్సీబీ.
గత సీజన్లో రూ.10 కోట్లకు క్రిస్ మోరిస్ను కొనుగోలు చేసిన ఆర్సీబీ, మళ్లీ అతని కోసం వేలంలో భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధమైంది. క్రిస్ మోరిస్ కోసం రూ. 9 కోట్ల 75 లక్షల దాకా పోటీపడింది రాయల్ ఛాలెంజర్స్. అలాంటప్పుడు అతన్ని వేలానికి ఎందుకు విడుదల చేసినట్టు? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు...
కేవలం ఇద్దరు ప్లేయర్ల కోసం రూ.29.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయిన మ్యాక్స్వెల్ను రూ.14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్కి రూ.10 కోట్లు పెట్టడమే తెలివితక్కువ పని అంటే, ఆర్సీబీ అతనికి చెల్లించే మొత్తం మూర్ఖత్వానికి పర్ఫెక్ట్ నిదర్శనం...
పెద్దగా క్రికెట్ ఆడని న్యూజిలాండ్ ప్లేయర్ కేల్ జెమ్మిసన్ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. బీబీఎల్లో రాణించినా, అతనికి ఈ రేంజ్ ధర దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... అతనితో పాటు డానియల్ క్రిస్టియన్ కోసం రూ.4 కోట్ల 80 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది ఆర్సీబీ.
ఆర్సీబీ మొత్తం వేలంలో సచిన్ బేబీ, కేఎస్ భరత్, మహ్మద్ అజారుద్దీన్, రజత్ పటిదార్, సుయాశ్ ప్రభుదేశాయ్ లను బేస్ ప్రైజ్కి కొనుగోలు చేయడం ఒక్కటే, మంచి మూవ్గా కనిపించింది. మిగిలిన ప్లేయర్ల విషయంలో ఆర్సీబీ ఎలాంటి వ్యూహం, స్ట్రాటెజీ లేకుండా బరిలో దిగినట్టు కనిపించింది.
వేలానికి ముందు ఆర్సీబీ ఖాతాలో రూ.35.40 కోట్ల భారీ మొత్తం ఉండగా, వేలంలో 8 మంది ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత మిగిలింది కేవలం రూ.35 లక్షలు మాత్రమే... ఇంత ఖర్చు చేసి కూడా 25 మందిని కొనుగోలు చేయలేకపోయింది ఆర్సీబీ. ప్రస్తుతం ఆర్సీబీ బలం 22 మంది మాత్రమే.
నిజానికి రాయల్ ఛాలెంజర్స్ను ఎప్పటినుంచో వెంటాడుతున్న ప్రధాన సమస్య బ్యాటింగ్లో సరైన హిట్టర్లు లేకపోవడం. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ తప్ప మరో స్టార్ ఆ జట్టులో లేడు.
దేవ్దత్ పడిక్కల్ రాణిస్తున్నా, భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. జోష్ ఫిలిప్ను పెద్దగా ఆడించలేదు. ఇలాంటి సమయంలో డేవిడ్ మలాన్ లాంటి బ్యాట్స్మెన్ కోసం ఆర్సీబీ ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ బౌలర్లను కొనుగోలు చేయడానికి చూపించిన ఆసక్తి, బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవడంపై పెట్టలేదు ఆర్సీబీ.
గ్లెన్ మ్యాక్స్వెల్కి భారీ మొత్తం చెల్లించినా, అతను ఐపీఎల్లో ఎలా ఆడతాడో గత సీజన్లోనే స్పష్టంగా కనిపించింది. యంగ్ సెన్సేషన్ మహ్మద్ అజారుద్దీన్, ఆర్సీబీకి బలం కావచ్చు. కానీ కోహ్లీ, ఏబీడీ త్వరగా అవుటైతే అజారుద్దీన్ స్కోరు బోర్డును ఎంత వరకూ పరుగెత్తించగలడు...
ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు టైటిల్ ఛాంపియన్గా నిలవడానికి వారి బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఓ కారణం. ఎన్ని వికెట్లు త్వరగా కోల్పోయినా భారీ షాట్లు ఆడగల ప్లేయర్లు ముంబైలో ఉన్నారు. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ ఎప్పుడు తెలుసుకుంటుందోనని బాధపడుతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.