- Home
- Sports
- Cricket
- కోహ్లీ లేకుండానే రోహిత్ ఆ ట్రోఫీ గెలిచాడు కదా.. దానికేమంటారు..? తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న బీసీసీఐ చీఫ్
కోహ్లీ లేకుండానే రోహిత్ ఆ ట్రోఫీ గెలిచాడు కదా.. దానికేమంటారు..? తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న బీసీసీఐ చీఫ్
Sourav Ganguly On Team India ODI Captaincy: ఒకే ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా టీమిండియాకు సరికాదనే ఉద్దేశంతోనే రోహిత్ ను వన్డే లకూ చెబుతున్న బీసీసీఐ.. విమర్శలు వస్తున్నా తమ నిర్ణయాన్ని సమరర్థించుకుంటున్నది.

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై చర్చ జోరుగా సాగుతున్నది. విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథిగా నియమించడంపై ఒకవైపు మాజీ సారథి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరోవైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నది.
ఒకే ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా టీమిండియాకు సరికాదనే ఉద్దేశంతోనే రోహిత్ ను వన్డే లకూ నాయకుడిగా నియమించామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. కోహ్లీకి కూడా ఈ విషయం చెప్పామని, అయితే అతడు తమ మాట వినకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇదే విషయమై గంగూలీ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ లేకుండా కూడా రోహిత్ శర్మ ఆసియా కప్ నెగ్గాడని, అది జట్టు బలాన్ని సూచిస్తుందని చెప్పుకొచ్చాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘2018లో అతడు (రోహిత్ శర్మ) ఆసియా కప్ లో భారత్ కు సారథిగా వ్యవహరించాడు. అందులో భారత్ కప్పు కూడా గెలిచింది. అప్పుడు విరాట్ కోహ్లీ లేకుండానే భారత్ కప్పు కొట్టింది.
కోహ్లీ లేకుండా టైటిల్ గెలవడమనేది భారత జట్టు బలాన్ని తెలుపుతున్నది. దీనిబట్టి చూస్తే రోహిత్ శర్మ భారీ టోర్నీలలో విజయవంతమైన నాయకుడిగా అవుతాడని నేను నమ్ముతున్నాను.
అంతేగాక అతడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని అందించాడు. భారీ టోర్నీలలో విజయాల కోసం అతడు తనదైన మార్గాన్ని కనుగొంటాడని నేను నమ్ముతున్నాను. అతడికి మంచి జట్టు కూడా ఉంది.. ’ అని గంగూలీ అన్నాడు.
ఇక కోహ్లీని వన్దే కెప్టెన్ గా తొలగించి రోహిత్ ను నియమించడం తానొక్కడి నిర్ణయం కాదని గంగూలీ చెప్పాడు. అది బీసీసీఐ లోని సెలెక్టర్లందరు కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయమని తెలిపాడు.
‘అది బోర్డు సమిష్టి నిర్ణయం. బీసీసీఐ, సెలెక్టర్లు కలిసి దీనిపై చర్చించాకే నిర్ణయాన్ని వెల్లడించారు. టీ20 కెప్టెన్ గా కొనసాగాలని బీసీసీఐతో పాటు నేను కూడా వ్యక్తిగతంగా కోహ్లీని కోరాను. కానీ అతడు దానికి అంగీకరించలేదు.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు అనేది భారత్ క్రికెట్ కు ఎంత మాత్రమూ మంచిది కాదని సెలెక్టర్లు ఈ నిర్ణయానికొచ్చారు...’ అని గంగూలీ వివరించాడు. ఏదేమైనా టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు పై చర్చ భారత క్రికెట్ లో ఇప్పట్లో ముగిసేలా లేదని అనిపిస్తున్నది.