Rohit Sharma: ఆసీస్ బౌలర్లను దంచి.. ప్రపంచ రికార్డు సాధించి.. టీ20లలో హిట్మ్యాన్ మరో ఘనత
IND vs AUS T20I: టీమిండియా సారథి రోహిత్ శర్మ శుక్రవారం నాగ్పూర్లో విశ్వరూపం చూపాడు. ఆసీస్ బౌలర్లకు తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే చుక్కలు లెక్కించే పని కల్పించాడు.
ఎన్నాళ్లయింది హిట్మ్యాన్ లో ఆ తరహా హిట్టింగ్ చూసి..? ఎన్ని రోజులయింది రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లలా మార్చి..? గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ కు రావడం.. రెండు మూడు భారీ షాట్లు ఆడి పెవిలియన్కు చేరడమే తప్ప ఇన్నింగ్స్ చివరివరకు నిలబడి మెరుపులు మెరిపించిన రోహిత్ ను చూసి చాలాకాలమైంది.
కానీ శుక్రవారం రాత్రి అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులకు ఆ అవకాశం దక్కింది. 8 ఓవర్లకే 91 పరుగులు ఛేదించాల్సిన క్రమంలో తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు లెక్కించే పని చేశాడు హిట్మ్యాన్.
టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలరైన జోష్ హెజిల్వుడ్ మొదలు పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, డేనియల్ సామ్స్ అందరి బౌలింగ్ లో దంచికొట్టాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసిన రోహిత్.. 4 భారీ సిక్సర్లు, 4 బౌండరీలు బాదాడు.
ఈ క్రమంలో రోహిత్ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్ లో భాగంగా హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతికి సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (172) ను అధిగమించాడు. ఆ తర్వాత రోహిత్ మరో మూడు సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితా చూస్తే రోహిత్ శర్మ.. 176 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా మార్టిన్ గప్తిల్ (172) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్ (12), ఆరోన్ ఫించ్ (119) ల తర్వాత స్థానాల్లో నిలిచారు.
రెండ్రోజులు వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ తడిగా మారిన ఈ పిచ్ లో శుక్రవారం మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానాలు తలెత్తాయి. అంపైర్లు పలు మార్లు గ్రౌండ్ ను పరిశీలించి.. 8 ఓవర్ల మ్యాచ్ ఆడించారు.
ఈ మ్యాచ్ లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మాథ్యూవేడ్ (43 నాటౌట్), కెప్టెన్ ఫించ్ (31) లు ధాటిగా ఆడారు.లక్ష్య ఛేదనలో ఇండియా.. 7.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో భారత్కు విజయం దక్కింది.