రోహిత్ శర్మ వీరబాదుడికి ఆరేళ్లు... ‘హిట్ మ్యాన్’ ఇన్నింగ్స్ ఎందుకింత స్పెషల్ అంటే...
వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీయే అసాధ్యం అనుకుంటున్న రోజుల్లో ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్... ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. గురువు వెనకే తాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పరిమిత్ ఓవర్ల క్రికెట్లో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాతే అసలు సిసలు ‘హిట్ మ్యాన్’ ఎంట్రీ ఇచ్చాడు. వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ బాదడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ.
2013, నవంబర్ 2న ఆస్ట్రేలియాపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై మొట్టమొదటిసారి డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ.
ఆ తర్వాత నవంబర్ 13న, 2014లో కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్లో శ్రీలంకతో జరిగిన వన్డేల్లో అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు హిట్ మ్యాన్...
173 బంతుల్లో 33 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 264 పరుగులు చేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... ఈ ఇన్నింగ్స్కి నేటికి ఆరేళ్లు.
ఈ ఇన్నింగ్స్లో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... హాఫ్ సెంచరీ మార్క్ అందుకునేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత 28 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
ఆ తర్వాత 100 నుంచి 150 చేరుకునేందుకు తర్వాతి 25 బంతులు తీసుకున్న రోహిత్... 151 బంతుల్లో డబుల్ సెంచరీ మార్కును చేరుకున్నాడు.
ఆ తర్వాత 200 నుంచి 250 మార్కు చేరుకునేందుకు కేవలం 15 బంతులు మాత్రమే తీసుకున్నాడు రోహిత్ శర్మ...
మొత్తంగా 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ... 50వ ఓవర్ ఆఖరి బంతికి కులశేఖర బౌలింగ్లో జయవర్థనేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 64 బంతుల్లో 6 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. మ్యాచ్లో టాప్ స్కోరర్కి, సెకండ్ టాప్ స్కోరర్కి మధ్య 198 పరుగుల తేడా ఉంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యధికం...
సురేశ్ రైనా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప... రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్కి పరోక్షంగా కారణమయ్యాడు. రోహిత్ శర్మ ఉన్న ఫామ్ను అర్థం చేసుకున్న రాబిన్ ఊతప్ప 16 బంతుల్లో 16 సింగిల్స్ తీసి రోహిత్ శర్మకి క్రీజు ఇచ్చాడు.
ఫలితంగా క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప మధ్య కేవలం 9.4 ఓవర్లలోనే 128 పరుగుల భాగస్వామ్యం నమోదైంది... వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదో రికార్డు.
నవంబర్ 13న వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ, మూడో డబుల్ సెంచరీని కూడా 13వ తేదీనే నమోదుచేశాడు. డిసెంబర్ 13, 2017లో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ.
కేవలం బౌండరీల ద్వారా (33 ఫోర్లు, 9 సిక్సర్లు) 186 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధికం.