- Home
- Sports
- Cricket
- ఛతేశ్వర్ పూజారా చేసిన పనికి రిషబ్ పంత్కి కోపం వచ్చింది... అచ్చం గౌతమ్ గంభీర్లానే...
ఛతేశ్వర్ పూజారా చేసిన పనికి రిషబ్ పంత్కి కోపం వచ్చింది... అచ్చం గౌతమ్ గంభీర్లానే...
రిషబ్ పంత్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అంటే... ఆస్ట్రేలియా 2020-21 టూర్. సిడ్నీలో జరిగిన టెస్టులో 97 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, బ్రిస్బేన్లో అజేయంగా 89 పరుగులు చేసి భారత జట్టుకి చరిత్రాత్మక విజయం అందించాడు. అయితే సిడ్నీ టెస్టులో పూజారా చేసిన పనికి రిషబ్ పంత్కి బాగా కోపం వచ్చిందట...

ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత పృథ్వీషా, వృద్ధిమాన్ సాహాలను తప్పించి రిషబ్ పంత్, శుబ్మన్ గిల్లకు అవకాశం కల్పించింది టీమిండియా. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరే టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు...
మెల్బోర్న్లో అజింకా రహానే సెంచరీతో సిరీస్ను 1-1 డ్రా చేసుకున్న భారత జట్టు, సిడ్నీలో జరిగిన మూడో టెస్టును అద్భుత పోరాటంతో డ్రా చేసుకుంది. 407 పరుగుల భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన భారత జట్టుకి ఓపెనర్లు రోహిత్ శర్మ 52, శుబ్మన్ గిల్ 31 పరుగులు చేసి శుభారంభం అందించారు...
అజింకా రహానే 4 పరుగులకే అవుటైనా ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్కి 148 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు..
మరో ఎండ్లో ఛతేశ్వర్ పూజారా 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసి అవుట్ కాగా హనుమ విహారి 161 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి 43 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి భారత జట్టుకి చారిత్రక డ్రా అందించారు...
‘రిషబ్ పంత్... కొద్దిసేపు నువ్వు నెమ్మదిగా ఆడు. సింగిల్స్, డబుల్స్ తీయడంపై ఫోకస్ పెట్టు. బౌండరీ కొట్టకు... అని పూజారా చెప్పిన సలహా, నన్ను ఇరకాటంలో పెట్టేసింది. నేనేమీ వచ్చిన ప్రతీ బాల్ బౌండరీకి పంపాలనే మైండ్సెట్తో బ్యాటింగ్ చేస్తున్నా...
మేం మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. నేను ఇంకో గంట గంటన్నర సేపు క్రీజులో ఉండి ఉంటే సిడ్నీ టెస్టులో కూడా గెలిచివాళ్లమే.. ఎందుకంటే అప్పుడు మేం నిర్మించిన మోమెంటమ్ అలా ఉండింది. అయితే పూజారా, సెంచరీకి చేరువయ్యావని గుర్తు చేయడంతో డబుల్ మైండ్తో షాట్స్ ఆడి అవుట్ అయ్యా...’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్..
ఆ సిరీస్లో మూడు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించిన అజింకా రహానే కూడా ఈ సంఘటన గురించి మాట్లాడాడు... ‘పూజారా మరో ఎండ్ నుంచి నెమ్మదిగా ఆడమని రిషబ్ పంత్కి చెబుతూ ఉన్నాడు. మెల్లిగా ఆడుతూ ఉంటే బౌలర్లపై ఒత్తిడి పెరిగి లైన్ అండ్ లెంగ్త్ కోల్పోతారని, వాళ్లు అలిసిపోయాక షాట్స్ కొట్టాలనేది పూజారా ఆలోచన...
సీనియర్లు అందరూ అలాగే చెబుతారు. అదీ కాకుండా 97 పరుగుల వద్ద ఉన్నావ్, సెంచరీ చేసుకున్నాక షాట్స్ ఆడమని పూజారా చెప్పిన తర్వాతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. అవుటైన వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి కోపంగా వచ్చాడు...
‘‘పూజారా భాయ్ నేను 97 పరుగుల వద్ద ఉన్నా అని గుర్తు చేశాడు. నాకు ఆ విషయం కూడా తెలీదు. ఆయన చెప్పకుండా ఉండి ఉంటే సెంచరీ చేసేవాడిని...’’ అన్నాడు... రవిశాస్త్రి, పంత్తో మాట్లాడి సర్దిచెప్పాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానే...
సరిగ్గా ఇలాంటి సంఘటనే వన్డే వరల్డ్ కప్ 2011లోనూ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ 97 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో ఉన్న ఎమ్మెస్ ధోనీ, ‘నువ్వు సెంచరీకి దగ్గర్లో ఉన్నావ్, జాగ్రత్తగా ఆడు..’ అని చెప్పడం వల్లే తాను త్వరగా అవుట్ అయ్యానని చాలాసార్లు వాపోయాడు గౌతమ్ గంభీర్..