రిషబ్ పంత్ సెంచరీ మిస్... 97 పరుగుల వద్ద అవుటైన యంగ్ వికెట్ కీపర్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్... సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్కి పంత్, పూజారా కలిసి జోడించిన భాగస్వామ్యం 148 పరుగుల వద్ద ముగిసింది. 250 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి.
ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో 500+ పరుగులు చేసిన మొట్టమొదటి ఆసియా వికెట్ కీపర్గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్..
అంతేకాకుండా విదేశాల్లో 500+ పరుగులు చేసిన రెండో భారత వికెట్ కీపర్ కూడా పంత్. ఇంతకుముందు వెస్టిండీస్పై ఫరూక్ ఇంజనీర్ ఈ ఫీట్ సాధించగా, రిషబ్ పంత్ ఆస్ట్రేలియాలో ఈ ఘనత సాధించాడు.
నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు చేసిన భారత వికెట్కీపర్గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్, తాజా స్కోరుతో రెండో స్థానంలోనూ నిలిచాడు...
నాథన్ లియాన్ బౌలింగ్లో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న రిషబ్ పంత్... ఆఖరికి అతని బౌలింగ్లోనే కమ్మిన్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
2018లో ఇంగ్లాండ్పై రెండో ఇన్నింగ్స్లో 114 పరుగులు చేసిన పంత్, ఆసీస్పై 97 పరుగులు చేసి... నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచాడు. 76 పరుగులతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు.
నాలుగో ఇన్నింగ్స్లో సెంచరీ, 90+ స్కోరు చేసిన రెండో వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇంతకుముందు బంగ్లా వికెట్ కీపర్ ముస్ఫికర్ రహీమ్ ఈ ఫీట్ సాధించాడు.
ఛతేశ్వర్ పూజారా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్త చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన 11వ భారత బ్యాట్స్మెన్ పూజారా...
అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 6 వేల మైలురాయిని చేరుకున్న ఆరో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు పూజారా. గవాస్కర్ 117, కోహ్లీ 119, సచిన్ 120, సెహ్వాగ్ 123, రాహుల్ ద్రావిడ్ 125 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించగా పూజారా 134 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
ఛతేశ్వర్ పూజారా కంటే ముందు గవాస్కర్, విశ్వనాథ్, వెంగ్సర్కార్, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ టీమిండియా తరుపున టెస్టుల్లో 6 వేలకు పైగా పరుగులు సాధించారు.
ఛతేశ్వర్ పూజారా టెస్టుల్లో మొదటి పరుగు చేసింది ఆస్ట్రేలియాపైనే కాగా, వెయ్యి పరుగులు, 2 వేల పరుగులు, 5 వేలు, 6 వేల పరుగుల మైలురాయి కూడా ఆస్ట్రేలియాపైనే సాధించాడు.
విదేశాల్లో నాలుగో ఇన్నింగ్స్లో మొట్టమొదటిసారి హాఫ్ సెంచరీ చేశాడు ఛతేశ్వర్ పూజారా. స్వదేశంలో రెండు సార్లు ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించాడు పూజారా.
మొదటి ఇన్నింగ్స్ల్లో 174 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పూజారా, రెండో ఇన్నింగ్స్లో 170 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు...
ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ నాలుగో వికెట్కి జోడించిన 148 పరుగులే నాలుగో ఇన్నింగ్స్లో టీమిండియాకు అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు రుసీ మోదీ, విజయ్ హాజరే 1948లో జోడించిన 139 పరుగుల రికార్డును బద్ధలు కొట్టారు పంత్, పూజారా.