రిషబ్ పంత్కి కీపింగ్ రాదు, సాహాకి బ్యాటింగ్ రాదు... ఇద్దరూ సరిపోయారు...
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ కోసం యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మధ్య చాలారోజులుగా పోటీ నెలకొని ఉంది. తొలి టెస్టులో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ. వికెట్ కీపింగ్లో తన రేంజ్లో సత్తా చాటిన వృద్ధిమాన్ సాహా, బ్యాటింగ్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సాహా, పంత్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా, రెండో టెస్టులో పాజిటివ్ ఎనర్జీతో బరిలో దిగాలని బావిస్తోంది. అందుకే జట్టులో కీలక మార్పులు చేయాలని చూస్తోంది.
మొదటి టెస్టులో విఫలమైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో, ప్రాక్టీస్ మ్యాచులో మెరుపు సెంచరీ చేసిన రిషబ్ పంత్ను ఆడించాలని తాత్కాలిక కెప్టెన్ రహానేకి సూచిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
అయితే భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
‘భారత ఓపెనర్లు దూకుడుగా లేరు... ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో కూడా మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగేవాడు... సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు రన్రేటు వన్డేల్లా దూసుకుపోయేది...
అలాంటి దూకుడు నేటి ఓపెనర్లలో కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద వెళ్లాడు కాబట్టి అతని స్థానంలో కెఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది...
బ్యాటింగ్లో దూకుడు చూపించాలంటే రిషబ్ పంత్ను తుదిజట్టులోకి తీసుకోవాలి... అదే మంచి వికెట్ కీపర్ కావాలనుకుంటే వృద్ధిమాన్ సాహాను కొనసాగించాలి...
ఎందుకంటే వృద్ధిమాన్ సాహా సరిగ్గా బ్యాటింగ్ చేయలేడు... రిషబ్ పంత్కి కీపింగ్ చేయడం రాదు... అలాగని వారిపై వేటు వేయడం సరికాదు...’ అని చెప్పాడు ఆకాశ్ చోప్రా.
బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలనుకుంటే పంత్కి అవకాశం ఇవ్వాలని చెప్పిన ఆకాశ్ చోప్రా... పంత్ను బ్యాట్స్మెన్గా తీసుకుని సాహాను కొనసాగించినా సమస్య లేదన్నాడు.
అయితే రిషబ్ పంత్కి బ్యాట్స్మెన్గా అవకాశం కల్పిస్తే, బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కి వచ్చే తెలుగు కుర్రాడు హనుమ విహారిని తప్పించాల్సి ఉంటుంది... అయితే విహారి స్థానంలో జడేజాను ఆడించాలని చూస్తోంది బీసీసీఐ.
జడేజాను ఆడిస్తే భారత జట్టులో అదనపు బౌలర్ చేరినట్టు అవుతుంది. అదే పంత్, సాహా ఇద్దరినీ ఆడిస్తే ఫీల్డింగ్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది..
మరి డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా సారథి అజింకా రహానే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి...