రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజస్థాన్ రాయల్స్ ముందు మంచి టార్గెట్...
ఐపీఎల్ 2021: ఆస్ట్రేలియా టూర్ నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, మరోసారి తన ఫామ్ను కొనసాగించాడు. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పృథ్వీషా 2 పరుగులకే అవుట్ కావడంతో 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ...
11 బంతుల్లో 9 పరుగులు చేసిన శిఖర్ ధావన్ను అవుట్ చేసిన జయ్దేవ్ ఉనద్కడ్, ఆ తర్వాతి ఓవర్లో అజింకా రహానేను అవుట్ చేసి ఢిల్లీకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు...
5 బంతులు ఆడిన మార్కస్ స్టోయినిస్, పరుగులేమీ చేయకుండానే ముస్తఫిజుర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్...
రాహుల్ తెవాటియా వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు రాబట్టిన రిషబ్ పంత్, 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు... కెప్టెన్గా రిషబ్ పంత్కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ...
మొదటి మ్యాచ్ ఆడుతున్న లలిత్ యాదవ్, 24 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. టామ్ కుర్రాన్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులు చేసి రనౌట్ కాగా... క్రిస్ వోక్స్ 15, రబాడా 9 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం...
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కడ్ మూడు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండు, క్రిస్ మోరిస్ ఓ వికెట్ తీశాడు.