ధోనీ వల్ల కానిది, రిషబ్ పంత్ చేసి చూపించాడు... ఇది ఆరంభం మాత్రమే...
మహేంద్ర సింగ్ ధోనీ... ఇండియన్ క్రికెట్లో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో రాణించే ప్లేయర్ కోసం వెతికిన అభిమానులకు దొరికిన ఆశాజ్యోతి రిషబ్ పంత్. అయితే పంత్ తన కెరీర్లో ఇప్పటికే మాహీ సాధించలేకపోయిన రికార్డులను తిరగరాస్తున్నాడు.
తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో రిషబ్ పంత్కి ఆరో ర్యాంక్ దక్కింది. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంతే...
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ టాప్ర్యాంకులో కొనసాగుతుండగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో, లబుషేన్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు.
భారత సారథి విరాట్ కోహ్లీ టాప్ 5లో ఉండి, రిషబ్ పంత్ కంటే ముందున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారీ శతకం సాధించిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు... రిషబ్ పంత్, హెన్రీ నికోలస్, రిషబ్ పంత్లకు సరిగ్గా 747 పాయింట్ల ఉండడం విశేషం.
మహేంద్ర సింగ్ ధోనీ తన టెస్టు కెరీర్లో సాధించిన అత్యుత్తమ ర్యాంకు 19 మాత్రమే. అంతకుముందు, ఆ తర్వాత భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవ్వరూ టాప్ 10లోకి కూడా రాలేకపోయారు.
ధోనీ వారసుడిగా కెరీర్ ప్రారంభంలో బీభత్సమైన ప్రెజర్ ఎదుర్కొన్న రిషబ్ పంత్, 2020 ఆసీస్ టూర్ నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
‘గబ్బా’ టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి ‘మ్యాచ్ విన్నర్’గా నిలిచిన రిషబ్ పంత్, సిడ్నీ టెస్టులో 97 పరుగులతో చెలరేగి.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహారించిన రిషబ్ పంత్... టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో జట్టును పాయింట్ల పట్టికలో టాప్లో నిలబెట్టాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్సీబీ మూడు చెరువుల నీళ్లు తాగిపించింది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి బంతి దాకా పోరాడి ఒక్క పరుగు తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఢిల్లీదే విజయం... గత సీజన్లో ముంబై చేతిలో నాలుగు సార్లు ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈ సీజన్లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్లో మంచి విజయాన్ని అందుకుంది.
అయితే కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో... రిషబ్ పంత్ అద్భుతమైన కెప్టెన్సీని అసాంతం చూసే అదృష్టం దక్కలేదు.
ప్రస్తుతం సమాచారం ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్ తిరిగి సెప్టెంబర్లో తిరిగి ప్రారంభం కానుంది. అప్పటికి శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకుంటాడు. దీంతో మిగిలిన మ్యాచ్లకు అయ్యర్ కెప్టెన్సీ వహించే అవకాశం ఉంటుంది.
రిషబ్ పంత్ వయసు ఇప్పుడు కేవలం 23 ఏళ్లు. అదీకాకుండా టెస్టు ఛాంపియన్షిప్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో టెస్టు మ్యాచులు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ల్లో ఒక్క సెంచరీ బాదినా, విరాట్ కోహ్లీ దాటి టాప్ ర్యాంకుకు దూసుకుపోతాడు రిషబ్ పంత్.