రిటైర్మెంట్ తర్వాత కూడా ఫారిన్ లీగుల్లో ఆడేదిలే!... సంచలన నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ, అదే జరిగితే...
ఐపీఎల్ తర్వాత బీబీఎల్, పీఎల్ఎల్, సీపీఎల్... ఇలా దాదాపు క్రికెట్ ఆడే ప్రతీ దేశం కూడా ఓ ఫ్రాంఛైజీ క్రికెట్ టోర్నీని తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి ఇతర దేశాల ప్లేయర్లు, ఐపీఎల్తో పాటు మిగిలిన అన్ని దేశాల లీగుల్లోనూ ఆడతారు..
వెస్టిండీస్ ప్లేయర్లు అయితే దేశానికి ఆడే మ్యాచుల కంటే ఫ్రాంఛైజీ లీగుల్లోనే ఎక్కువ కనిపిస్తారు. క్రిస్ గేల్, కిరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్ వంటి సీనియర్లు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇచ్చే వేతనాలు సరిపోక... ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, విండీస్ క్రికెట్ పతనానికి కారణమైంది.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు ట్రెంట్ బౌల్డ్, జిమ్మీ నీశమ్, మార్టిన్ గుప్తిల్, కోలిన్ డీ గ్రాండ్హోమ్ వంటి ప్లేయర్లు, ఫ్రాంఛైజీ క్రికెట్కి అందుబాటులో ఉండేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పుకున్నారు. అయితే మొదటి నుంచి భారత ప్లేయర్లకు విదేశీ లీగుల్లో ఆడడానికి అనుమతి లేదు..
ఈ కారణంగానే భారత క్రికెట్ బోర్డుకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మురళీ విజయ్ వంటి ప్లేయర్లు, ఫారిన్ లీగుల్లో పాల్గొన్నారు. సురేష్ రైనా కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు..
Irfan Pathan
టీమిండియాలో అవకాశం కోసం ఏళ్లుగా ఎదురుచూసి విసుగు చెందిన ఉన్ముక్త్ చంద్, స్మిత్ పటేల్ వంటి ప్లేయర్లు, భారత క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చి, అమెరికాకి మకాం మార్చేశారు. మైనర్ లీగ్ క్రికెట్లో ఆడిన వీళ్లు, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీతో పాటు బిగ్బాష్ లీగ్ వంటి టోర్నీల్లో కూడా పాల్గొన్నారు..
అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా భారత ప్లేయర్లు, విదేశీ లీగుల్లో ఆడకుండా చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట బీసీసీఐ. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీని గురించి చర్చ జరిగిందని భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షా తెలిపాడు..
‘కొందరు ప్లేయర్లు, ఫారిన్ లీగుల్లో ఆడేందుకు కావాలనే చిన్న వయసులోనే భారత క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తున్నట్టు గుర్తించాం. ఈ రకమైన ముందస్తు రిటైర్మెంట్లను నియంత్రించేందుకు ఓ పాలసీని రూపొందించబోతున్నాం. నెల రోజుల్లో ఈ పాలసీ తయారవుతుంది. ఆ తర్వాత దీని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం..’ అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు..
stuart
ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్, స్టువర్ట్ బిన్నీ వంటి భారత మాజీ ప్లేయర్లు, జింబాబ్వే ఆఫ్రీ టీ10 లీగ్కి రిజిస్టర్ చేసుకున్నారు. రాబిన్ ఊతప్ప, యూసఫ్ పఠాన్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో పాల్గొన్నారు. అంబటి రాయుడు, మేజర్ లీగ్ క్రికెట్లో ఆడబోతున్నారు.
Jay Shah-Stuart Binny
ఇప్పుడు బీసీసీఐ పాలసీ తీసుకొస్తే వీళ్లు ఫారిన్ లీగుల్లో ఆడడానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఫారిన్ లీగుల్లో ఆడవద్దని చెప్పే హక్కూ, అధికారం బీసీసీఐకి ఎలా ఉంటాయనేది అనుమానమే. బీసీసీఐ నుంచి ఎలాంటి పారితోషికం కానీ ప్రయోజనం కానీ పొందనప్పుడు వారిని నియంత్రించే అధికారం.. బోర్డుకు ఉండదని ఓ భారత మాజీ ప్లేయర్ వ్యాఖ్యానించాడు.