RCB vs DC: ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీ టీమ్.. ఢిల్లీ పై ఆర్సీబీ విక్టరీ
RCB vs DC IPL 2025: రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2025 ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఈ సీజన్లో ఏడో విజయాన్ని అందుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
RCB vs DC: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ విక్టరీలు అందుకుంటూ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది.
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంత గ్రౌండ్ లో ఓడించింది. భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్, లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య సూపర్ బ్యాటింగ్ ఆర్సీబీ ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2025 46వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడినా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్లోగా ఇన్నింగ్స్ ను కొనసాగించింది.
అభిషేక్ పొరెల్, ఫాఫ్ డుప్లెసిస్ మొదటి వికెట్కు 33 పరుగులు జోడించారు. పొరెల్ కేవలం 11 బంతుల్లో 2 బౌండరీలు, ఒక సిక్సర్తో 28 పరుగులు చేసి జోష్ హాజిల్వుడ్కు వికెట్ రూపంలో దొరికాడు. కరుణ్ నాయర్ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. 4 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ 22 పరుగులు, కేఎల్ రాహుల్ రాహుల్ 41 పరుగులు చేశారు. చివరలో ట్రిస్టన్ స్టబ్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 34 పరుగులు (18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో) చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (15), అశుతోష్ శర్మ (2)లు బ్యాట్తో ప్రభావం చూపలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. దీంతో 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిట్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ఆరంభం లభించలేదు. ఫిల్ సాల్ట్ స్థానంలో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన జాకబ్ బెథెల్ 6 బంతుల్లో ఒక్కో బౌండరీ, సిక్సర్తో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దేవదత్ పడిక్కల్ జీరోకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక పరుగుకే ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
అయితే, ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న విరాట్ కోహ్లీ-కృనాల్ పాండ్యా జోడీ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీకి నాల్గవ వికెట్కు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య అద్భుత శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ, పిచ్కి అలవాటు పడిన తర్వాత దూకుడు పెంచి డెల్లీ బౌలర్లను చితకొట్టారు.
నాల్గవ వికెట్కు 84 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. జట్టు గెలవడానికి కేవలం 18 పరుగులు అవసరమైనప్పుడు విరాట్ కోహ్లీ దుష్మంత చమీరా బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ 47 బంతుల్లో 4 బౌండరీలతో 51 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుతంగా ఆడిన కృనాల్ పాండ్య 73 పరుగులతో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.
ఢిల్లీ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. అక్షర్ పటేల్, దుష్మంత చమీర తప్ప, ఢిల్లీ బౌలింగ్ నిరాశపరిచింది. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మిచెల్ స్టార్క్ మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ముఖేష్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 3.3 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. విప్రజ్ నిగమ్ ఒక ఓవర్లో 12 పరుగులు ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో నిపుణుడైన కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.