Dhanashree verma: ఆ బట్టలు వేసుకున్నందుకే ఆర్సీబీకి ఓటమి..! చాహల్ భార్య పొట్టి డ్రెస్ పై ట్రోలింగ్
Ipl 2021: ఐపీఎల్ రెండో ఫేజ్ లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో ఆర్సీబీ పరాజయాన్ని మూటగట్టుకున్నది. అయితే బెంగళూరు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ మ్యాచ్ కు రావడమే బెంగళూరు విజయావకాశాలను దెబ్బతీసిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్, డాన్సర్ అయిన చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. చాహల్ తో కలిసి దుబాయ్ వెళ్లిన ఆమె ఆర్సీబీ ఆడే మ్యాచులలో తళుక్కున మెరుస్తున్నది.
శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా ధనశ్రీ తళుక్కుమంది. పొట్టి స్కర్ట్ ధరించి మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చిన ఆమె.. అందుకు సంబంధించిన చిత్రాలను తన Instagram అకౌంట్ లో పోస్ట్ చేసింది.
వాటిని పోస్ట్ చేస్తూ.. తామంతా ఒకే కుటుంబమని, గెలుపైనా ఓటమైనా తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ఆమె రాసుకొచ్చింది. కొద్దిసేపట్లోనే ఈ పోస్టుకు లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వచ్చాయి.
అయితే నిన్నటి ఆటలో ఆర్సీబీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. చాహల్ ఒక వికెట్ తీసుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నెటిజన్లు ధనశ్రీని టార్గెట్ చేశారు. ధనశ్రీ క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు రావడంతోనే బెంగళూరు వరుసగా పరాజయాల బాట పట్టిందని, ఇకపై ఆర్సీబీ మ్యాచ్ లకు రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరికొందరు ఆకతాయిలైతే.. ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్ కారణంగానే బెంగళూరు చెన్నై చేతిలో పరాజయం పాలైందని కామెంట్స్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి నాలుగింటిలో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.