BCCI: ఇంకా కోలుకోని జడ్డూ.. బంగ్లా టూర్కూ అనుమానమే..?
India Tour Of Bangladesh:గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనే ఇంటిబాట పట్టిన జడేజా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లతో పాటు కీలకమైన టీ20 ప్రపంచకప్ కు కూడా అందుబాటులో లేడు. అయితే కాలిగాయం నుంచి కోలుకున్నా..

ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. టీ20 సిరీస్ ముగించుకున్న భారత్.. మరో మూడు వన్డేలు ఆడుతుంది. ఆ తర్వాత భారత జట్టు నేరుగా బంగ్లాదేశ్ కు వెళ్లనుంది. అయితే ఈ సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లా పర్యటనకు వెళ్లేది అనుమానంగానే ఉంది.
Image credit: PTI
గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనే ఇంటిబాట పట్టిన జడేజా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లతో పాటు కీలకమైన టీ20 ప్రపంచకప్ కు కూడా అందుబాటులో లేడు. అయితే కాలిగాయం నుంచి కోలుకున్న జడేజా బంగ్లా టూర్ కు అందుబాటులో ఉంటాడని అంతా అనుకున్నారు.
ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఎంపిక చేసిన జట్టులో జడేజా పేరు కూడా ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం జడేజా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, అతడు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇంకా ఫిట్నెస్ సాధించని జడేజా.. ఎన్సీఏలో వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అంతేగాక రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి పోటీలో ఉన్న రివాబా కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఫిట్నెస్ ప్రక్రియ కొద్దిరోజులు పక్కకువెళ్లే అవకాశముంది. ఎన్నికల దృష్ట్యా జడేజా బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకోవడమే బెటరనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తున్నది.
ఒకవేళ జడేజా ఫిట్నెస్ సాధించక బంగ్లా టూర్ నుంచి తప్పుకుంటే గనక టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు బంగ్లా టూర్ లో అవకాశం దక్కొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.తన కెరీర్ లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న సూర్యను టెస్టులలోకి ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా ఈ విషయమై పునరాలోచనలో పడింది.
జడేజాతో పాటు ఈ సిరీస్ కు ఎంపికైన వారిలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. జడేజా లేకపోయినా ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ కూడా దీనిపై పెద్దగా ఆందోళన చెందడం లేదు. సూర్యకు కూడా అవకాశం దక్కకుంటే ఇండియా - ఏ తరఫున ఆడుతున్న యువ స్పిన్నర్ సౌరభ్ కుమార్ కు పిలుపు అందొచ్చనీ తెలుస్తున్నది.
బంగ్లాదేశ్ తో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 14 - 18 మధ్య తొలి టెస్టు, 22-26 మధ్య రెండో టెస్టు జరుగుతుంది. అంతకంటే ముందే వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కు సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మలు అందుబాటులో ఉంటారు.
బంగ్లాదేశ్ తో టెస్టులకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్