టెస్టులు ఆడాలనుకుంటే 3, 4 రోజుల్లో ఆస్ట్రేలియా రండి... రోహిత్, ఇషాంత్ శర్మలకు రవిశాస్త్రి వార్నింగ్...
ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడిన భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ... ఆస్ట్రేలియా టూర్లో టెస్టులకి ఎంపికైన సంగతి తెలిసిందే. నవంబర్ 27న మొదలయ్యే వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్... ఆ తర్వాత టెస్టు సిరీస్ ఉండడంతో మెల్లిగా ఆస్ట్రేలియా వెళ్లవచ్చని భావించారు రోహిత్, ఇషాంత్... కానీ వారికి వెంటనే ఆస్ట్రేలియాకి వచ్చేయాల్సిందిగా అల్టిమేటం జారీచేశాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి.
రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడుతుంటే, ఇషాంత్ శర్మ మోచేతి కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నారు... ఈ ఇద్దరూ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా చేరుకుంటారని వార్తలు వచ్చాయి...
అయితే టెస్టు సిరీస్ ఆడాలనుకుంటే వెంటనే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలని ఈ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ప్రస్తుతం ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ కలిసి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ తీసుకుంటున్నారు... రాహుల్ ద్రావిడ్ సమక్షంలో పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నారు.
కరోనా నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా చేరుకున్న ఆటగాళ్లకు మొదట కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగిటివ్ ఫలితం వచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది...
ఆ తర్వాతే మ్యాచులు ఆడేందుకు ఆటగాళ్లకు అనుమతి లభిస్తుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే రోహిత్, ఇషాంత్ ఇద్దరూ సోమవారం ఆస్ట్రేలియా బయలుదేరాల్సి ఉంటుంది...
ఆలస్యమైతే డిసెంబర్ 6 నుంచి 8 వరకూ జరిగే వామప్ మ్యాచ్కి ఈ ఇద్దరూ దూరం అవుతారు... టెస్టు సిరీస్ ముందు రెండు వామప్ మ్యాచులు ఆడనుంది టీమిండియా. ఆస్ట్రేలియా ఏ టీమ్తో జరిగే రెండో వామప్ మ్యాచ్ డిసెంబర్ 11న జరుగుతుంది.
‘ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ టెస్టు సిరీస్ ఆడాలనుకుంటే వెంటనే ఆస్ట్రేలియా బయలుదేరి వచ్చేయాలి. మూడు, నాలుగు రోజుల్లో ఆసీస్ గడ్డ మీద అడుగుపెట్టకపోతే, వారికి టెస్టు సిరీస్ ఆడే అవకాశాలు కూడా తగ్గుతాయి...
ఐపీఎల్లో కూడా పెద్దగా ఆడని ఇషాంత్ శర్మకు ప్రాక్టీస్ చాలా అవసరం. కాబట్టి టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు అతను ప్రాక్టీస్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది... ’ అని చెప్పాడు రవిశాస్త్రి...
తన గాయంపై వివాదం రేగడంతో స్వయంగా స్పందించిన రోహిత్ శర్మ... గాయం నుంచి శారీరకంగా కోలుకున్నా, మానసికంగా కోలుకుని టెస్టు సిరీస్కి సన్నద్ధం అవ్వడానికి ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 17 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ మొదలు కానుంది. ఐసీసీ రూల్స్ మార్చడంతో టెస్టు ఛాంపియన్షిప్లో రెండోస్థానానికి పడిపోయిన టీమిండియా, మళ్లీ టాప్ ప్లేస్కి చేరాలంటే ఈ టెస్టు సిరీస్లో గెలవడం తప్పనిసరి.