Sarfaraz Khan: ముంబైని ఆదుకున్న సర్ఫరాజ్ ఖాన్.. రంజీ ఫైనల్లో సూపర్ సెంచరీ
Ranji Trophy 2022: బెంగళూరు వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ-2022 ఫైనల్లో బ్యాటింగ్ లో తడబడ్డ ముంబై జట్టును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆదుకున్నాడు.
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్ లో పీక్స్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 3 సెంచరీలు చేసిన అతడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీ-2022 ఫైనల్లో మరో సెంచరీతో కదం తొక్కాడు.
మధ్యప్రదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబైని యశస్వి జైస్వాల్ (78) తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (134) లు ఆదుకున్నారు. వీరి జోరుతో ముంబై.. 127.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌట్ అయింది.
243 బంతులాడిన సర్ఫరాజ్ ఖాన్.. 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 134 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా మొక్కవోని దీక్షతో క్రీజులో నిలిచి ముంబైకి మంచి స్కోరు అందించాడు.
బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపికగా ఆడిన సర్ఫరాజ్.. సెంచరీ చేయడానికి ఏకంగా 190 బంతులాడాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్ రెండో రోజు ఆటలో 152 బంతులాడి అర్థసెంచరీ మార్క్ను అందుకున్న సర్ఫరాజ్ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 38 బంతుల్లోనే అందుకోవడం విశేషం. ముంబై ఇన్నింగ్స్ లో చివరివరకు ఆడిన సర్ఫరాజ్.. ఆఖరి వికెట్ గా వెనుదిరగడం విశేషం.
ఈ మ్యాచ్ కు ముందు వరకు సర్ఫరాజ్.. ఈ సీజన్ లో 5 మ్యాచులాడి 7 ఇన్నింగ్స్ లలో 803 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా మరో సెంచరీ కలవడంతో మొత్తం స్కోరు 937కు, సెంచరీల సంఖ్య 4కు చేరింది.
ఇదిలాఉండగా.. ముంబైని 374కు ఆలౌట్ చేసిన మధ్యప్రదేశ్.. రెండో రోజు ఆట రెండో సెషన్ లో 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. యశ్ దూబే (6), హిమాన్షు మంత్రి (11) క్రీజులో ఉన్నారు.