ఇప్పటికే చాలా అవకాశాలిచ్చాం.. ఇక దేశవాళీకి తరలండి.. ఆ ఇద్దరు వెటరన్స్ కు బీసీసీఐ ఆదేశం..?
BCCI On Pujara And Rahane's Poor Form: భారత టెస్టు జట్టులో వెటరన్ ఆటగాళ్లైన పుజారా, రహానే లకు ఇప్పటికే లెక్కకు మించి అవకాశాలిచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఇకమీదట దానికి ఫుల్ స్టాప్ పెట్టనుంది.
టీమిండియాకు టెస్టు ఫార్మాట్ లో గత కొద్దిరోజులుగా మూల స్థంభాలుగా ఉన్న ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లకు బీసీసీఐ కీలక ఆదేశాలను జారీ చేయనున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఇద్దరూ గతంలో పోటీ పడి పరుగులు చేసినా ఏడాదిన్నరగా మాత్రం వారి ప్రదర్శన చూస్తే జట్టుకు భారమయ్యారా..? అనిపించక మానదు.
ఇక ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లో కూడా ఈ ద్వయం అట్టర్ ఫ్లాఫ్ అయింది. రోహిత్ శర్మకు గాయం, రెండో టెస్టులో విరాట్ కోహ్లి గైర్హాజరీ సందర్భంలో బాధ్యతగా ఆడాల్సిన ఈ జోడీ.. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడింది.
ఆపద సమయంలో ఆదుకుంటారని భావించిన అభిమానులను ఈ జంట తీవ్రంగా నిరాశపరిచింది. వీరి పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు కూడా తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఈ ఇద్దరి ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రాగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి చర్చించి వీరిని దేశవాళీ క్రికెట్ ఆడి అందులో నిరూపించుకోవాలని ఆదేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి. అక్కడ కూడా విఫలమైతే మాత్రం ఇక అంతే సంగతులని తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మేము రాహుల్ ద్రావిడ్ తో పాటు టెస్టు కెప్టెన్ (ఇంకా ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఎంపిక చేసే అవకాశముంది) తో కలిసి కూర్చుని చర్చిస్తాం. ఇప్పటికైతే ఆ ఇద్దరి (పుజారా, రహానే) లకు తలుపులు ఇంకా మూసుకుపోలేదు. వాళ్లను దేశవాళీ ఆడాల్సిందిగా మేం సూచిస్తాం. తద్వారా కోల్పోయిన గత ఫామ్ ను అందుకోవడానికి వారికి అవకాశమిస్తాం...’ అని తెలిపాడు.
కాగా.. ఇప్పటికిప్పుడు రహానే, పుజారాలు దేశవాళీ క్రికెట్ ఆడాలన్నా ఆ అవకాశం లేదు. కరోనా కారణంగా జనవరి, ఫిబ్రవరి లో జరగాల్సిన రంజీ సీజన్ కూడా వాయిదా పడింది. మళ్లీ దానిని ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక ఫిబ్రవరి మాసాంతంలో శ్రీలంక జట్టు భారత్ తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో పుజరా, రహానే లు శ్రీలంక పర్యటన తర్వాతే దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం దక్కుతుంది.
మరి శ్రీలంక పర్యటనకు ఈ ద్వయాన్ని ఎంపిక చేస్తారా..? లేక అవకాశాల కోసం కాచుకు కూర్చున్న హనుమా విహారి, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ లకు అవకాశాలిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
గడిచిన 12 నెలలలో 14 టెస్టులాడిన పుజారా సగటు 24.08 గా ఉంది. 2019 జనవరి నుంచి అతడు సెంచరీ చేయలేదు. రహానే పరిస్థితి పుజారా కంటే అద్వాన్నంగా ఉంది. గత 12నెలలుగా 13 టెస్టులాడిన అతడి బ్యాటింగ్ సగటు 20 గా నమోదైంది.
ఇక సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లో మూడు టెస్టులు ఆడిన పుజారా.. 136 పరుగులు చేస్తే అన్నే టెస్టులాడిన రహానే 124 రన్స్ చేశాడు. కాగా.. ఈ సిరీస్ లో ఎక్స్ట్రాల ద్వారా భారత్ కు వచ్చిన పరుగుల (136) కంటే రహానే చేసిన రన్స్ తక్కువ. పుజారా కూడా అంతే.