జయహో జయసూర్య.. 71 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిన లంక స్పిన్నర్..
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు.

శ్రీలంక జట్టులోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మాత్రం రికార్డులు చాలా త్వరగానే బ్రేక్ చేస్తున్నాడు. స్వదేశంలో స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై అదరగొడుతున్నాడు. ఐర్లాండ్ తో గాలే వేదికగా ముగిసిన రెండో టెస్టులో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
టెస్టులలో అత్యంత వేగంగా యాభై వికెట్లు తీసిన తొలి స్పిన్నర్ గా జయసూర్య నిలిచాడు. 50 వికెట్లు తీయడానికి అతడికి ఏడు టెస్టులు (11 ఇన్నింగ్స్) మాత్రమే కావాల్సి వచ్చాయి. ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చిన పాల్ స్టిర్లింగ్ వికెట్ తీయడం ద్వారా జయసూర్య ఈ ఘనత అందుకున్నాడు. ఈ టెస్టులో జయసూర్య మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టాడు.
Image credit: Getty
టెస్టులలో ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్. వెస్టిండీస్ కు చెందిన ఈ స్పిన్నర్ 1951-52 మధ్య కాలంలో 8 టెస్టులలో (15 ఇన్నింగ్స్)నే 50 వికెట్లు తీశాడు. ఇప్పుడు జయసూర్య.. 71 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్ గా కూడా నిలిచాడు. ఈ ఫీట్ సాధించినవారిలో దక్షిణాఫ్రికాకు చెందిన ఫిలాండర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్సన్ కూడా ఉన్నారు.
కాగా టెస్టులలో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఆస్ట్రేలియాకు చెందిన టర్నర్ పేరిట రికార్డు ఉంది. ఈ దివంగత క్రికెటర్.. 6 టెస్టుల (11 ఇన్నింగ్స్) లోనే 50 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఆ తర్వాత రికార్డు జయసూర్యదే కావడం గమనార్హం.
ఇదిలాఉండగా శ్రీలంక - ఐర్లాండ్ మధ్య గాలే వేదికగా ముగిసిన రెండో టెస్టులో లంక ఇన్నింగ్స్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 492 పరుగులు చేసింది. అనంతరం లంక.. తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 704 పరుగులు చేసింది.
లంక జట్టులో మధుష్క (205), కుశాల్ మెండిస్ (245) లు డబుల్ సెంచరీలతో చెలరేగారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో లంక ఘనవిజయాన్ని అందుకుంది.