- Home
- Sports
- Cricket
- ‘ఇండియాలో టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగిస్తున్నారు.. ఇక మెరుగైన ఫలితాలు రమ్మంటే ఎలా వస్తాయి..?’
‘ఇండియాలో టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగిస్తున్నారు.. ఇక మెరుగైన ఫలితాలు రమ్మంటే ఎలా వస్తాయి..?’
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓటమి తర్వాత భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టులలో భారత జట్టు ఆడే దృక్పథం మారాలని పలువురు సూచిస్తున్నారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు ఆసీస్ చేతొలో ఓడటంతో మరోసారి భారత క్రికెట్ జట్టుతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టులను ఆడే విషయంలో టీమిండియా, ఆడించే విషయంలో బీసీసీఐ దృక్పథం మారాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో ఆడే మ్యాచ్ లు రెండున్నర రోజుల్లో ముగించి ఇంగ్లాండ్ లో ఐదు రోజులు ఆడి మెరుగైన ఫలితాలు సాధించమంటే ఎలా.? అని వాపోయాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత హర్భజన్ స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత్ లో జరిగే టెస్టు మ్యాచ్ లను చూడండి. రెండున్నర రోజుల్లోనే ముగుస్తున్నాయి. మహా అయితే మూడు రోజులు. అంతకుమించి జరుగవు. మరి ఇండియాలో రెండున్నర రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ను ముగించేవాళ్లు ఇంగ్లాండ్ లో ఐదు రోజులు ఎలా ఆడగలరు..?
అసలు ఇండియాలో టెస్టులు ఆడేప్పుడు ఫాస్ట్ బౌలర్లకు ఏమైనా పని ఉంటుందా..? ప్రారంభ ఓవర్ల నుంచే కెప్టెన్లు స్పిన్నర్లకు బంతినిచ్చి వారితో వేయిస్తున్నారు. అసలు టెస్టులలో పేసర్లకు పెద్దగా పనిలేకుండా పోతోంది.
అక్కడ ఏమాత్రం ఫాస్ట్ బౌలర్లను వాడని జట్టు ఉన్నఫళంగా ఇక్కడకు వచ్చి ఐదు రోజులు ఆడాలని.. వికెట్లు కావాలని అంటే ఎలా..? ఈ విషయంలో జట్టుతో పాటు బోర్డు కూడా పునరాలోచించాలి...’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కాగా ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు చాలాకాలంగా భారత్.. స్వదేశంలో ఆడే టెస్టులకు స్పిన్ ట్రాక్ లనే తయారుచేస్తున్నది. ఒక్క భారత్ మాత్రమే కాదు.. మిగతా దేశాలు కూడా వారి హోం కండీషన్స్ కు అనుగుణంగా అక్కడి పిచ్ లను తయారుచేసుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్ కూడా ఇదే కోవలోకి వచ్చేదే.
Image credit: PTI
ఇండియాలో స్పిన్ ట్రాక్ లను ఏర్పాటుచేసుకున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇతర విదేశీ టూర్లలో ఓడటానికి కూడా ఇవే కారణమవుతున్నాయి. మన పేసర్లు విదేశాల్లో తప్ప స్వదేశంలో నామమాత్రమే అవుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కాస్త బెటర్ గానే ఉన్నా టెస్టులలో మాత్రం వారికి పెద్దగా పనిలేకుండానే పోయింది.