- Home
- Sports
- Cricket
- ఆ రెండు టీమ్లకు గొప్ప పిచ్లు అవసరం లేదు.. వారిని ఓడించడం చాలా ఈజీ.. రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
ఆ రెండు టీమ్లకు గొప్ప పిచ్లు అవసరం లేదు.. వారిని ఓడించడం చాలా ఈజీ.. రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తమ దేశంలో పర్యటించే పెద్ద దేశాల గురించే తాము ఆలోచిస్తామని.. చిన్న దేశాలను అసలు పట్టించుకోమన్నట్టుగా మాట్లాడాడు.

వచ్చే ఏడాది భారత జట్టు ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ కు రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడటానికి భారత్ కు రాబోమని హెచ్చరికలు పంపి వార్తల్లో నిలిచిన తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్, శ్రీలంకల మీద చులకనగా మాట్లాడాడు.
ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్.. రావల్పిండిలో పాకిస్తాన్ ను ఓడించడం, రావల్పిండి పిచ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రమీజ్ రాజా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాము అసలు పెద్ద జట్లు వస్తేతప్ప చిన్న టీమ్ ల గురించి పట్టించుకోమని వ్యాఖ్యానించాడు.
జీవం లేని రావల్పిండి పిచ్ ను తయారుచేశారని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ అథర్టన్ అడిగిన ప్రశ్నకు రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కంటే బంగ్లాదేశ్, శ్రీలంకలతో మేం టెస్టులు ఆడాం. పెద్ద జట్లతో పోల్చితే బంగ్లా, లంక తో ఆడేప్పుడు గొప్ప పిచ్ అవసరం లేదు. ఆ టీమ్ లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు లేరని నేను అనను. నేను వారిని తక్కువ చేయడం లేదు గానీ ఆ జట్లను ఓడించడం చాలా ఈజీ.
దక్షిణాఫ్రికా మంచి జట్టు. వాళ్లు ఉపఖండం చాలా తక్కువగా వస్తారు. కావున మాకు నిజమైన సవాల్ ఎదురైంది ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు వచ్చినప్పుడే. మాక్కూడా రివర్స్, స్పిన్ పిచ్ లు తయారుచేయాలని ఉంది. ఐదు రోజుల పిచ్ ను సిద్ధం చేసే నైపుణ్యం, కళాత్మకత మాకు అంతగా లేనందున మేం చాలా కష్టపడాల్సి వచ్చింది.
Pakistan Cricket
రావల్పిండిలో గడ్డిని తొలగించాము. పిచ్ పూర్తిగా ఎండిపోయింది. దాంతో మాకు ఎదురుదెబ్బ తగిలింది. కానీ ముల్తాన్ లో చూడండి. బంతి బౌలర్లకు సహకరిస్తున్నది. తొలి బంతి నుంచే అక్కడ బంతి బౌలర్లకు అనుకూలంగా ఉంది...’ అని అన్నాడు. అయితే లంక, బంగ్లా జట్లను ఓడించడం ఈజీ అని రమీజ్ చెప్పగా.. ఆసియా కప్ లో లంక చేతిలోనే ఫైనల్ లో పాకిస్తాన్ ఓడింది. ఇక పలుమార్లు బంగ్లా కూడా పాక్ కు షాకులిచ్చిన విషయాన్ని ఆ దేశాల ఫ్యాన్స్ రమీజ్ కు గుర్తు చేస్తున్నారు.
పాకిస్తాన్ లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు రావల్పిండితో పాటు ముల్తాన్ టెస్టులో ఫలితం తేలలేదు. దీంతో మూడో టెస్టుకోసం ఆస్ట్రేలియా నుంచి పిచ్ క్యూరేటర్లను తెప్పించింది పీసీబీ. ఈ విషయాన్ని స్వయంగా రమీజ్ రాజానే తెలిపాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్.. 115 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ ఫలితంపై తాము నిరాశకు లోనయ్యామని రమీజ్ తెలిపాడు.