- Home
- Sports
- Cricket
- రెండున్నర నెలలు చాలదు.. ఐపీఎల్ ను ఇలా నిర్వహించండి : బీసీసీఐకి పంజాబ్ కింగ్స్ ఓనర్ సూచన
రెండున్నర నెలలు చాలదు.. ఐపీఎల్ ను ఇలా నిర్వహించండి : బీసీసీఐకి పంజాబ్ కింగ్స్ ఓనర్ సూచన
IPL 2023: ఐపీఎల్ లో రాబోయే ఐదేండ్ల కాలానికి మ్యాచుల సంఖ్య పెంచాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పంజాబ్ కింగ్స్ ఓనర్ కూడా స్పందించాడు.

రాబోయే 2023-27 కాలానికి గాను ఐపీఎల్ లో మ్యాచుల సంఖ్య పెరగనుండటంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ).. ఐపీఎల్ ను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ చేసే విధంగా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. అయితే బీసీసీఐ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీసీఐ ఇలా చేస్తే ద్వైపాక్షిక సిరీస్ ల మీద ఆ ప్రభావం తీవ్రంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక ఈ విషయం గురించి ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించాలని నిర్ణయించింది.
ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ఓనర్ గా ఉన్న నెస్వాడియా స్పందించాడు. ఈ సమస్యకు ఆయన తనదైన పరిష్కారం చూపాడు. ఐపీఎల్ లో మ్యాచుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పిన ఆయన.. ఆ మేరకు ఒకే సీజన్ లో వీలుకాకుంటే రెండు సీజన్లలో అయినా నిర్వహించాలని సూచించాడు.
ఇదే అంశంపై పీటీఐతో నెస్వాడియా మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ క్రికెట్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. దీంతో క్రికెట్ ప్రపంచ క్రీడగా అవతరించింది. భవిష్యత్ లో అది మరింత విస్తరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాబోయే సీజన్లలో మ్యాచుల సంఖ్యను పెంచడం.. సీజన్ గడువును పెంచడం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఏకకాలంలో సీజన్ ను పూర్తి చేయకుంటే దానిని ఏడాదిలో రెండు సీజన్లుగా విడగొట్టండి. ఒకటి ఇండియాలో మరొకటి విదేశాలలో . ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు నివసిస్తున్నారు. ఈ లీగ్ లో ఇప్పుడు నిర్వహిస్తున్నదానికంటే ఇంకా చాలా గేమ్స్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని తెలిపాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభమై 15 ఏండ్లు గడిచింది. ఈపాటికే మ్యాచుల సంఖ్య భారీగా పెరిగి ఉండాల్సింది. చాలా సమయం వృథా అయింది. ఇప్పటికైనా మేల్కొంటే మంచిది. జీనిని సీసాలో ఎన్నాళ్లు దాస్తారు..?’ అని ప్రశ్నించాడు.
మరి ఇన్నాళ్ల సీజన్ ప్రేక్షకులు చూడగలరా అన్న ప్రశ్నకు నెస్వాడియా సమాధానం చెబుతూ.. ‘అది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే అప్పుడే మనలోని క్రియేటివిటీ బయటకు తీయాలి.
ప్రపంచలో ఇతర లీగ్ లు ఎలా నడుస్తున్నాయో చూడాలి. ప్రస్తుతానికైతే మనం దానికి (ప్రేక్షకుల అలసట) దూరంగా ఉన్నాం. ఒకవేళ అక్కడికి వచ్చినా మనం వంతెనను దాటతాం..’ అని కామెంట్స్ చేశాడు.