- Home
- Sports
- Cricket
- మీరు మా దేశంలో ఆసియా కప్ ఆడకుంటే మేం టెస్టు సిరీస్ రద్దు చేస్తాం : శ్రీలంకకు పాక్ బెదిరింపులు
మీరు మా దేశంలో ఆసియా కప్ ఆడకుంటే మేం టెస్టు సిరీస్ రద్దు చేస్తాం : శ్రీలంకకు పాక్ బెదిరింపులు
Asia Cup 2023: ఆసియా కప్ - 2023 వివాదంలో తమ పంతం నెగ్గించుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నది. ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంక తమ దేశం రాకుంటే తాము కూడా ఆ దేశం వెళ్లేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నది.

ఆసియా కప్ - 2023 ను ఎలాగైనా తమ దేశంలో నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దిశగా మరోసారి బెదిరింపులనే ఆయుధంగా చేసుకున్నది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షరతుల మేరకు హైబ్రిడ్ మోడల్ ను కూడా అంగీకరించిన పీసీబీ.. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఇచ్చిన షాకులతో సతమతమవుతోంది.
హైబ్రిడ్ మోడల్ తమకు అంగీకారంగా లేదని, అలా అయితే తాము ఈ టోర్నీని ఆడబోమని శ్రీలంక క్రికెట్ తో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఇటీవలే పాకిస్తాన్ కు షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆసియా కప్ ను పాకిస్తాన్ లో కాకుండా శ్రీలంకలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పావులు కదుపుతోంది.
అయితే ఈ టోర్నీని ఎలాగైనా తమ దేశంలో నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న పాకిస్తాన్.. ఏసీసీ, బీసీసీఐ లను బెదిరించినా లాభం లేదనుకుని డైరెక్ట్ శ్రీలంకకు ధమ్కీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకవేళ తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను అంగీకరించకుంటే ఈ ఏడాది జులై లో శ్రీలంక పర్యటనకు రాబోమని తేల్చి చెప్పినట్టు సమాచారం.
సామా న్యూస్ లో వచ్చిన కథనం మేరకు.. ఒకవేళ శ్రీలంక జట్టు ఆసియా కప్ లో తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కు అంగీకారం తెలపకుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు జులైలో లంక పర్యటనకు రాబోదని పీసీబీ వర్గాలు శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పినట్టు తెలుస్తున్నది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ లో భాగంగా.. పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 సైకిల్ లో జులైలో శ్రీలంకలో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.
మరి పీసీబీ బెదిరింపులకు శ్రీలంక లొంగుతుందా..? అన్నది త్వరలో తేలనుంది. పీసీబీ మాదిరిగానే లంక క్రికెట్ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ దేశం.. ఆసియా కప్ ను బీసీసీఐ అండతో నిర్వహించేందుకు సిద్ధమైంది. మరి పీసీబీ తాజా బెదిరింపులకు లంక ఎలా కౌంటర్ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.