- Home
- Sports
- Cricket
- పైలెట్ అవుదామని వెళ్తే పనికిరావన్నారు.. ఇప్పుడతడే పాక్ను ప్రపంచకప్ నుంచి పంపిస్తున్నాడు.. ఎవరీ సికందర్ రజా?
పైలెట్ అవుదామని వెళ్తే పనికిరావన్నారు.. ఇప్పుడతడే పాక్ను ప్రపంచకప్ నుంచి పంపిస్తున్నాడు.. ఎవరీ సికందర్ రజా?
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం రాత్రి జింబాబ్వే - పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ను క్రెయిగ్ ఎర్విన్ సారథ్యంలోని జింబాబ్వే ఆఖరి బంతి వరకూ పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే విజయానికి ప్రధాన కారణం సికందర్ రజా.

జింబాబ్వే - పాకిస్తాన్ మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ముగిసిన ఉత్కంఠ పోరులో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సమిష్టిగా ఆడి చివరి బంతి వరకూ పోరాడిన జింబాబ్వే విజయంలో బౌలర్లందరినీ మెచ్చుకోకుండా ఉండలేం గానీ ఆ జట్టు విజయానికి ప్రధాన కారణం ఆల్ రౌండర్ సికందర్ రజా.
నిన్నటి మ్యాచ్ లో రజా.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో షాదాబ్ ఖాన్, హైదర్ అలీలను ఔట్ చేసిన రజా.. తర్వత ఓవర్లో క్రీజులో కుదురుకున్న షాన్ మసూద్ ను కూడా పెవిలియన్ కు పంపి జింబాబ్వేను పోటీలోకి తెచ్చాడు. ఈ మ్యాచ్ లో విజయంతో సికందర్ రజా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నది. అసలు ఎవరీ సికందర్ రజా..? పాకిస్తాన్ తో ఇతడికున్న సంబంధమేమిటి..?
సికందర్ రజా భట్.. పాకిస్తాన్ లోనే జన్మించాడు. అతడిది పాక్ లోని పంజాబ్ ప్రావిన్సులో గల సియాల్ కోట్. పంజాబీ మాట్లాడే కాశ్మీరి ఫ్యామిలీ. చిన్నప్పుడు పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. బాల్యదశ నుంచే పైలట్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు కదిలాడు. ఆ దిశగా సాధన కూడా చేశాడు.
పైలట్ అవ్వాలనే లక్ష్యంతో చదివిన రజా.. అందుకు సంబంధించి పరీక్షలను క్లీయర్ చేశాడు. కానీ మెడికల్ టెస్టులలో భాగంగా అతడి కంటిచూపు సరిగా లేదని చెప్పి అధికారులు అతడిని వెనక్కి పంపించారు. దాంతో ఆకాశంలో ఎగరాలనే అతడి కలల కల్లలయ్యాయి.
2002లో రజా కుటుంబం జింబాబ్వేకు వలస వెళ్లింది. అదే సమయంలో రజా.. స్కాట్లాండ్ లోని గ్లాస్గో కెలాడోనియన్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందాడు. పైలెట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో అప్పుడు రజా క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. జింబాబ్వే దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
2009 నుంచి జింబాబ్వే దేశవాళీలో ఆడిన రజా.. 2013 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. 36 ఏండ్ల ఈ ఆల్ రౌండర్ గత పదేండ్లలో జింబాబ్వే విజయాలలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే రజా.. ఇప్పటివరకు 17 టెస్టులలో 1,187 పరుగులు చేసి 34 వికెట్లు తీశాడు. 123 వన్డేలలో 3,656 పరుగులు చేసి 70 వికెట్లు పడగొట్టాడు. 61 టీ20లలో 1,176 రన్స్ చేసి 33 వికెట్లు తీశాడు.
ఇక తాజా ప్రపంచకప్ విషయానికొస్తే.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో రజా బ్యాటింగ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్ లో ఆ జట్టు 129 పరుగులకే పరిమితమైంది. తర్వాత బౌలింగ్ చేస్తూ మ్యాచ్ నిలుపుకునే ప్రయత్నం చేసింది. కానీ రజా బౌలింగ్ కు వచ్చేటప్పటికీ పాకిస్తాన్.. 14 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసి పటిష్టంగా ఉంది. షాదాబ్ ఖాన్, షాన్ మసూద్ ఆడుతున్నారు.
అయితే రజా వేసిన 14 ఓవర్లో నాలుగో బంతికి షాదాబ్ ఖాన్, ఐదో బంతికి హైదర్ అలీలు ఔటయ్యారు. మ్యాచ్ లో ఇదే టర్నింగ్ పాయింట్. ఇక తన తర్వాత ఓవర్లో రజా.. షాన్ మసూద్ ను కూడా ఔట్ చేసి తన జట్టును పోటీలో నిలిపాడు. రజా ఇచ్చిన షాక్ లతో పాకిస్తాన్ ను కోలుకోనీయకుండా చేశారు జింబాబ్వే బౌలర్లు.. చివరి ఓవర్లలో అత్యద్భుతంగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ ను ఓడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ టోర్నీలో నిలవాలంటే తాను ఆడే మిగతా మూడు మ్యాచ్ లలో గెలవడమే గాక ఇతర జట్ల సమీకరణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికాలు సెమీస్ కోసం బెర్తులు ఖాయం చేసుకుంటున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ కథ పెర్త్ లోనే ముగిసిందనే చెప్పొచ్చు. ఈ ముగింపులో కీలక పాత్రదారి పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తే కావడం కొసమెరుపు.