IPL 2022: అప్పటిదాకా ఆటగాళ్లెవరితో ఒప్పందాలు కుదుర్చుకోవద్దు.. ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి బీసీసీఐ హెచ్చరిక
IPL Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో త్వరలో వేలం ప్రక్రియ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే కొత్త ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను సంప్రదించడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా ఫ్రాంచైజీలు తాము దక్కించుకోబోయే ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని కలవరపడుతున్నాయి.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో 8 ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటెన్షన్ జాబితాలో పేరు లేని క్రికెటర్లను మిగతా ఫ్రాంచైజీలతో పాటు కొత్తగా చేరుతున్న రెండు ఫ్రాంచైజీలు కూడా సంప్రదించాయని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని లక్నో ఫ్రాంచైజీ.. పంజాబ్ సూపర్ కింగ్స్ మాజీ సారథి, టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ ను సంప్రదించిందని, అతడితో భారీ డీల్ కూడా కుదుర్చుకుందని ఆరోపణలు వచ్చాయి. అంతేగాక పంజాబ్ కింగ్స్ కూడా దీనిపై బీసీసీఐ మౌఖికంగా ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ.. లక్నో ఫ్రాంచైజీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ కు సంబంధించిన వ్యవహారం ముగిసేదాకా ఏ ఆటగాడితో సంప్రదింపులు గానీ, ఒప్పందాలు గానీ చేసుకోకూడదని లక్నోను హెచ్చరించినట్టు తెలుస్తున్నది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త టీమ్ ల బిడ్ల ప్రక్రియలో లక్నోను రూ. 7,090 కోట్లతో చేజిక్కించుకున్న ఆర్పీఎస్జీ.. రూ. 5,625 కోట్లతో అహ్మాదాబాద్ ను దక్కించుకున్న సీవీసీ లు ఆటగాళ్ల వేటలో పడ్దాయి. అయితే సీవీసీ.. పలు బెట్టింగ్ కంపెనీలతో వ్యవహారాలు నడుపుతున్నదని ఆరోపణలు వచ్చిన దరిమిలా.. బీసీసీఐ దానిపై విచారణ చేపట్టింది.
వచ్చే వారంలో దీనికి సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. దీంతో ఆ నిర్ణయం ప్రకటించి తాము చెప్పేదాకా ఆటగాళ్లెవరినీ సంప్రదించవద్దని లక్నోను బీసీసీఐ ఆదేశించినట్టు బోర్డు వర్గాల సమాచారం.
రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఐపీఎల్ వేలానికి ముందు కొత్త ఫ్రాంచైజీలకు.. పాత ఫ్రాంచైజీలలో ముగ్గురు ఆటగాళ్లను తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. అయితే ఇందుకు గాను డిసెంబర్ 25 తర్వాతనే ఆ ప్రక్రియను చేపట్టాలి. తాజా వార్తల నేపథ్యంలో ఆ గడువును మరింత పొడిగించే అవకాశముందని తెలుస్తుంది.
ఇక వేలానికి సంబంధించిన విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అహ్మదాబాద్ టీమ్ కు సంబందించిన సమస్య వచ్చే వారంలో పరిష్కారమవుతుంది. అయితే ఇప్పటికీ ఐపీఎల్ వేలానికి సంబంధించిన తుది తేదీలను ఇంకా ప్రకటించలేదు. జనవరి రెండో వారంలో వేలం ఉండే అవకాశముంది..’ అని అన్నాడు.