- Home
- Sports
- Cricket
- రెస్ట్ తీసుకుంటే ఎవ్వరూ ఫామ్లోకి రారు... రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడంపై ఇర్ఫాన్ పఠాన్...
రెస్ట్ తీసుకుంటే ఎవ్వరూ ఫామ్లోకి రారు... రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడంపై ఇర్ఫాన్ పఠాన్...
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి మాజీ క్రికెటర్లు 32+ వయసు దాటిన తర్వాతే ఎక్కువ క్రికెట్ ఆడారు. ఆస్ట్రేలియా టూర్, బంగ్లాదేశ్ టూర్, జింబాబ్వే టూర్ అనే తేడా లేకుండా టీమిండియా ఆడే ప్రతీ సిరీస్కి ప్లేయర్లు అందుబాటులో ఉండేవాళ్లు. గాయమైతే తప్ప, రెస్ట్ కోసమని స్పెషల్గా పక్కనబెట్టడం అస్సలు లేదు...

భారత మాజీ కెప్టెన్లు ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఇదే ఫార్ములాని కొనసాగించారు. సీనియర్ ప్లేయర్ అయినా, జూనియర్ ఆటగాడైనా టీమిండియా ఆడే ప్రతీ సిరీస్కి అందుబాటులో ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పద్ధతి పూర్తిగా మారిపోయింది...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సిరీస్కో కెప్టెన్ని మారుస్తున్న భారత క్రికెట్ బోర్డు, విశ్రాంతి పేరిట సీనియర్ క్రికెటర్లను చాలా సిరీస్లకు దూరంగా పెడుతోంది. భారత ప్రధాన ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా కలిసి ఓ వన్డే మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిదంటే... టీమిండియాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ఇంగ్లాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ టూర్కి కూడా వెళ్లడం లేదు.. వన్డే సిరీస్కి ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు సెలక్టర్లు...
విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో ఆడితే, రోహిత్ శర్మ ఆ సమయంలో కరోనా బారిన పడి విశ్రాంతి తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు ఇంగ్లాండ్తో జరిగే మొదటి టీ20 నుంచి విశ్రాంతి కల్పించారు...
అసలే ఫామ్లో లేక పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ... ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 వంటి మెగా టోర్నీలు ఉన్న సమయంలో ఫామ్లో లేని ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడంపై వ్యంగ్యంగా స్పందించాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
‘ఏ ప్లేయర్ కూడా రెస్ట్ తీసుకుంటూ ఫామ్లోకి రాలేడు...’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. ప్రత్యేకంగా పేరు ప్రస్తావించకపోయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇవ్వడంపైనే ఇర్ఫాన్ పఠాన్ ఇలా ట్వీట్ చేశాడని క్లియర్గా అర్థమవుతోంది...
Virat Kohli-Rohit Sharma
రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ కూడా తనకి ఎప్పుడూ ఫలానా సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని కోరలేదని, అలాంటిది ఈ తరం క్రికెటర్లు... సందు దొరికితే ఆట నుంచి తప్పుకోవడానికి కారణాలు వెతుకుతున్నట్టుగా అలసిపోయామని రెస్ట్ కావాలని అంటున్నారని వాపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ కూడా ఫామ్లో లేని సమయంలో ఎక్కువ మ్యాచులు ఆడాలని తపన పడేవాడని, పరుగులు చేయడానికి ఇంకా ఎక్కువగా నెట్స్లో శ్రమించేవాడని గుర్తు చేస్తున్నారు. నేటి తరం క్రికెటర్ల వైఖరి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు...