- Home
- Sports
- Cricket
- వాళ్లల్లో ఒక్కడైనా సరిగ్గా క్యాచ్ పట్టగలడా..? మరి అర్ష్దీప్ను విమర్శించే హక్కు ఎక్కడిది..?
వాళ్లల్లో ఒక్కడైనా సరిగ్గా క్యాచ్ పట్టగలడా..? మరి అర్ష్దీప్ను విమర్శించే హక్కు ఎక్కడిది..?
Arshdeep Singh: టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.

ఆసియా కప్-2022లో భాగంగా సూపర్-4లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ అసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను జారవిడవడంతో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అతడి కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిందని ఆరోపిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక వికిపీడియాలో అర్ష్దీప్ ఐడెంటిటీని మారుస్తూ.. అతడిని ‘ఖలిస్తాని’గా చిత్రీకరించడం తీవ్ర దుమారానికి తెరతీసింది. అయితే దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Arshdeep Singh
తాజాగా ఇదే విషయమై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ ట్రోల్స్ కు అంతగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని సన్నీ చెప్పాడు. అర్ష్దీప్ ను విమర్శించేవాళ్లలో ఒక్కడికైనా క్యాచ్ లు పట్టే సత్తా ఉందా..? అని ఘాటుగా ప్రశ్నించాడు.
సన్నీ మాట్లాడుతూ.. ‘అర్ష్దీప్ ను ఏ ఒక్క మాజీ క్రికెటర్ విమర్శించలేదు. ఎవరు వీళ్లంతా...? వాళ్లకు అంతగా ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరమేముంది..? అర్ష్దీప్ ను విమర్శించేవాళ్లల్లో ఒక్కడికైనా క్యాచ్ పట్టగలిగే సత్తా ఉందా..?
Arshdeep Singh
స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ లు చూస్తారు కదా.. స్టాండ్స్ లో పడ్డ ఏ ఒక్క బంతినైనా వీళ్లు క్యాచ్ పట్టగలరా..? ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించడం.. ఈ ట్రోల్స్ కు అంత ప్రాముఖ్యమివ్వడం శుద్ధ దండగ. అసలు వీటి గురించి పట్టించుకోవడం కూడా వృథా..’ అని తనదైన శైలిలో స్పందించాడు.
ఇదిలాఉండగా అర్ష్దీప్ కు సంబంధించిన వికిపీడియా పేజీలో.. 2018 అండర్-19 లో అతడు ఖలిస్తాన్ తరఫున అరంగేట్రం చేసినట్టు ఎడిట్ చేశారు కొందరు దుండగులు. అంతేగాక 2022 జులైలో ఖలిస్తాన్ జట్టుకు ఆడాడని, ఆసియా కప్ లో కూడా ఖలిస్తాన్ తరఫునే పోటీ పడుతున్నాడని ఎడిట్ చేశారు. ఈ యువ పేసర్ వికిపీడియా పేజీలో కూడా దేశం అనేదగ్గర ఇండియాను తీసేసి ఖలిస్తాన్ పంజాబ్ అని మార్చారు.