Rohit Sharma: అది మాములు విషయం కాదు.. అతడి సేవలు భారత జట్టుకు అవసరం.. విరాట్ పై హిట్ మ్యాన్ ప్రశంసలు
Virat Kohli: పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ కు సారథ్యం వహించనున్న కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. తన కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. విరాట్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం అది ఎంతో అవసరమని అన్నాడు.
అనూహ్య పరిణామాల మధ్య భారత వన్డే కెప్టెన్సీ బదిలీ అయింది. వన్డేలలో విశిష్టమైన రికార్డు ఉన్నా ఐసీసీ టోర్నీలలో వైఫల్యం.. మునపటి ఫామ్ కోల్పోవడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దలు విరాట్ కోహ్లీపై వేటు వేశారు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో తాను సారథిగా కొనసాగుతానని చెప్పినా సెలెక్టర్లు వినలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహం దెబ్బ తింటే విరాట్ కోహ్లీ.. రోహిత్ కెప్టెన్సీలో సరిగా ఆడతాడా..? లేదా..? అని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు.
విరాట్ వంటి బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారని, అన్ని ఫార్మాట్లలో నాణ్యమైన ఆట ఆడటమనేది చాలా తక్కువ మందిలో ఉండే నైపుణ్యమని కొనియాడాడు. టీ20 ఫార్మాట్ లో 50 ప్లస్ యావరేజీతో దూసుకుపోతున్న విరాట్ జట్టుతో ఉండటం ఆ జట్టుకు ఎంతో లాభించేదని అన్నాడు.
బ్యాక్ స్టేజ్ విత్ బొరియా అనే ఆన్ లైన్ షోలో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ.. ‘విరాట్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరం. టీ20 ఫార్మాట్ లో 50 ప్లస్ సగటు అనేది మాములు విషయం కాదు.
ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో అతడు (విరాట్) భారత్ ను గెలిపించాడు. అంతేగాక అతడు ఇప్పటికీ భారత జట్టు సారథిగానే నేను భావిస్తా. అటువంటి ఆటగాడిని కోల్పోవడానికి ఏ కెప్టెన్ కూడా ఇష్టపడడు. జట్టులో అతడు ఉండటం ఎంతో అవసరం..’ అని తెలిపాడు.
ఆటగాడిగా ఎన్ని సెంచరీలు చేసినా ఛాంపియన్షిప్ గెలవడమే ముఖ్యమని హిట్ మ్యాన్ అన్నాడు. ‘క్రీడల్లో మీరు బెస్ట్ ను సాధించాలి. ఆ బెస్ట్ ఏంటంటే ఏదైనా ఛాంపియన్షిప్ ను గెలవడం. మీరు వేలాది పరుగులు సాధించవచ్చు..ఎన్ని సెంచరీలైనా చేయవచ్చు.
కానీ ఛాంపియన్షిప్ గెలవడం అనేది చాలా కీలకమైన అంశం. అయితే అది ఒక్కరి వల్ల కాదు. జట్టుగా సాధించాలి. క్రీడల్లో మీరు ఏం సాధించారన్నది చాలా ముఖ్యం..’ అని చెప్పాడు.