నాథన్ లియాన్కి ఇచ్చారు, మరి జో రూట్కి ఎందుకు ఇవ్వలేదు... ఓడిపోయామని వదిలేశారా...
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఘోరంగా ఫెయిల్ కాగా, ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ చెలరేగిన పిచ్పై భారత బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. అయితే తొలి టెస్టు తర్వాత భారత జట్టు చేసిన ఓ పని, విమర్శలకు తావిస్తోంది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్కి 100వ టెస్టు మ్యాచ్.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్కి 100వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా, మ్యాచ్ ముగిసిన తర్వాత నాథన్ లియాన్కి నూరో టెస్టు జ్ఞాపికగా భారత ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని అందచేశాడు అప్పటి కెప్టెన్ అజింకా రహానే. కానీ చెన్నై టెస్టులో 100వ టెస్టు ఆడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి మాత్రం టీమిండియా తరుపున నుంచి ఎలాంటి జ్ఞాపిక రాలేదు.
గబ్బా టెస్టులో విజయం సాధించిన ఉత్సాహంతో నాథన్ లియాన్కి జెర్సీ కానుకగా ఇవ్వడానికి ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ చూపించిన టీమిండియా, తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో ఊహించని పరాజయం కారణంగా జ్ఞాపిక ఇవ్వడానికి ధైర్యం చూపించలేకపోయిందని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్...
‘టీమిండియా, నాథన్ లియాన్కి 100వ టెస్టు జ్ఞాపిక గబ్బా టెస్టు ముగిసిన తర్వాత సంతకాలు చేసిన జెర్సీని అందించింది. మరి చెన్నై టెస్టు ముగిసిన ఒకరోజు తర్వాతైనా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఈ కానుక అందుకున్నాడా? నాకు తెలిసి అయితే ఇంకా లేదు. ఎవరైనా కన్ఫార్మ్ చేస్తారా...’ అంటూ ట్వీట్ చేశాడు మైఖేల్ వాగన్.
ఆస్ట్రేలియా టూర్ ఆరంభానికి ముందు కూడా భారత జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మైఖేల్ వాగన్. భారత జట్టు ఆస్ట్రేలియాలో 4-0 తేడాతో టెస్టు సిరీస్ను కోల్పోతుందని అంచనా వేశాడు. మెల్బోర్న్ విజయం తర్వాత కూడా ఆసీస్ 3-1 తేడాతో సిరీస్ గెలుస్తుందని చెప్పాడు వాగన్. అయితే గబ్బా టెస్టు విజయం తర్వాత టీమిండియా అదరగొట్టిందని పొడుగుతూ ట్వీట్ చేశాడు మైఖేల్ వాగన్.
మైఖేల్ వాగన్ వెటకారపు పోస్టుకి భారత అభిమానులు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఒక్క టెస్టులో విజయం సాధించినంత మాత్రాన ఇంత బిడియం పనికి రాదని హెచ్చరిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇండియా నుంచి ఇంగ్లాండ్ పట్టుకెళ్లిన కోహినూర్ డైమండ్ తిరిగి ఇచ్చినప్పుడు భారత ఆటగాళ్లు, ఇంగ్లాండ్ కెప్టెన్కి సంతకాలు చేసిన జెర్సీని జ్ఞాపకంగా అందిస్తారంటూ ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా నిలిచిన జో రూట్, భారత జట్టుపై టీమిండియాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్గానూ నిలిచాడు. టీమిండియాపై ఆరంగ్రేటం చేసిన జో రూట్, తన 50వ, 100వ మ్యాచ్ కూడా ఇండియాపైనే ఆడడం మరో అరుదైన రికార్డు.