- Home
- Sports
- Cricket
- దేశవాళీలో రాణిస్తా జాతీయ జట్టులో మెరుస్తా.. నా టార్గెట్ అదే : టీమిండియా ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశవాళీలో రాణిస్తా జాతీయ జట్టులో మెరుస్తా.. నా టార్గెట్ అదే : టీమిండియా ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ENG vs IND: వన్డేలలో భారత జట్టు ఓపెనర్, రాబోయే వెస్టిండీస్ టూర్ లో టీమిండియాకు సారథిగా వ్యవహరించబోతున్న శిఖర్ ధావన్ జట్టులోకి తన పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా ఓపెనర్, అభిమానులంతా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ తన భవిష్యత్ లక్ష్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నెరవేర్చుకునే దిశగా తాను సన్నద్ధమవుతున్నట్టు కూడా చెప్పాడు.
ఇండియా-ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేకు ముందు టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా దృష్టంతా ఇండియాలో వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ మీదే ఉంది.
ఈ గ్యాప్ లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడాలని నేను భావిస్తున్నాను. అందుకే దేశవాళీ వన్డేలు, టీ20 మ్యాచులలో ఆడాలని అనుకుంటున్నా. ఇక ప్రపంచకప్ కంటే ముంద మనకు ఐపీఎల్ కూడా ఉండబోతుంది. అక్కడ కూడా నన్ను నేను నిరూపించుకోవాలి. అప్పుడే ప్రపంచకప్ లో నాక మెరుగైన అవకాశాలు దక్కుతాయి.
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాను. నెట్స్ లో ప్రాక్టీస్ చేశాను. ఈ సిరీస్ లో పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వస్తాననుకుంటున్నాను. ఓపెనర్ గా నాకు కావాల్సినంత అనుభవముంది. నా బ్యాటింగ్ టెక్నిక్ ను మెరుగుపరుచుకుంటున్నాను. చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారిస్తా..’ అని తెలిపాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 15 లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ధావన్.. 14 ఇన్నింగ్స్ లలో 460 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఈ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించినవారి జాబితాలో ఎనిమిదోస్థానంలో నిలిచాడు. అయినా ధావన్ కు దక్షిణాఫ్రికా తో ముగిసిన టీ20లతో పాటు ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లకు అవకాశం దక్కలేదు.
Image credit: Getty
అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ధావన్ కు అవకాశం దక్కింది. మంగళవారం ముగిసిన తొలి వన్డేలో ధావన్ - రోహిత్ లు ఇంగ్లాండ్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించారు. ఇదిలాఉండగా త్వరలో జరుగబోయే వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు బీసీసీఐ.. ధావన్ ను సారథిగా నియమించిన విషయం తెలిసిందే.