నా క్రికెట్ జర్నీ ఇద్దరు మహేంద్రులు ఉన్నారు : రవీంద్ర జడేజా
IPL 2023: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన క్రికెట్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఇద్దరు మహేంద్రులు ఉన్నారని చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గత దశాబ్దకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జడేజా.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కాగా మరో పది రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ - 16 సీజన్ కు ముందు జడేజా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ జర్నీలో ఇద్దరు మహేంద్ర సింగ్ లు ఉన్నారని.. ఇద్దరు మహేంద్రుల మధ్య తన ప్రయాణం సాగిందని జడేజా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ లో వచ్చిన ‘స్టార్ ఆన్ స్టార్’లో జడేజా ఈ వ్యాఖ్యలు చేశాడు.
జడేజా మాట్లాడుతూ.. ‘నేను ఈ విషయం ఇదివరకే మహీ భాయ్ (ధోని)కు చెప్పాను. నా క్రికెటింగ్ జర్నీలో ఇద్దరు మహేంద్ర సింగ్ లు ఉన్నారు. వారిలో ఒకరు నా చిన్ననాటి కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్. మరొకరు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని. నా సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం ఈ ఇద్దరి మధ్యే సాగింది..’అని చెప్పాడు.
ఇదే కార్యక్రమంలో జడేజా మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించాడు. ప్రస్తుతం స్పిన్నర్ గా ఉన్న తాను ముందు ఫాస్ట్ బౌలర్ గా ప్రాక్టీస్ చేశానని జడ్డూ చెప్పుకొచ్చాడు. ఫాస్ట బౌలర్ల మాదిరిగా తాను కూడా బౌన్సర్లు ప్రాక్టీస్ చేశానని, కానీ తన బౌలింగ్ లో అంత వేగం లేకపోవడంతో స్పిన్ వైపునకు మరిలానని తెలిపాడు.
‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన కొత్తలో నాకు ఫాస్ట్ బౌలింగ్ చాలా ఇష్టముండేది. ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు సంధించినప్పుడు చూస్తే కిక్ వచ్చేది. నేను కూడా ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశా. బ్యాటర్లకు బౌన్సర్లు వేశా. కానీ పేసర్లు వేసినప్పుడు వచ్చేంత వేగం నా బౌలింగ్ లో లేదనిపించింది. అందుకే దాని జోలికి పోలేదు.’అని తెలిపాడు.
కాగా సీఎస్కే తరఫున ఆడుతున్న ఈ ఆల్ రౌండర్ ఆ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 143 మ్యాచ్ లలో రవీంద్ర జడేజా 114 వికెట్లు తీశాడు. బ్యాటర్ గా 112 ఇన్నింగ్స్ లలో 1,596 రన్స్ చేశాడు. గతేడాది సీఎస్కే దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది జడ్డూపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.