- Home
- Sports
- Cricket
- ఫామ్ పోయింది పనికిరాడన్నారు.. పక్కనబెట్టారు.. ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.. విజయమంటే ఇదేనేమో..!
ఫామ్ పోయింది పనికిరాడన్నారు.. పక్కనబెట్టారు.. ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.. విజయమంటే ఇదేనేమో..!
IPL 2022 Finals: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో.. గాయాలబారిన పడ్డ ఓ ఆటగాడిని ఇక జట్టులోకి తీసుకోవడానికే వెనుకాడిన మాజీ ఛాంపియన్లు అతడిని దారుణంగా అవమానించారు. ఇప్పుడు అదే జట్టు కుమిలి కుమిలి ఏడుస్తున్నది. అతడు ఆటకు పనికిరాడన్న వాళ్లు వేనోళ్ల కీర్తిస్తున్నారు.

గతేడాది దుబాయ్ లో టీ20 ప్రపంచకప్. భారత జట్టు తరఫున ఆల్ రౌండర్ కోటాలో హార్ధిక్ పాండ్యా కు చోటు దక్కింది. పేరుకు ఆల్ రౌండర్ అయినా అతడు బ్యాటర్ గా మాత్రమే బరిలో ఉన్నాడు. భారత్ ఆడిన మ్యాచుల్లో బ్యాటర్ గా అడపాదడపా రాణించాడే తప్ప బౌలర్ గా రాణించలేదు.
టీ20 ప్రపంచకప్ లో భారత్ ఓడింది. ఆ టోర్నీ తర్వాత పాండ్యా తుది జట్టులో చోటు కోల్పోయాడు. రెండేండ్లుగా గాయాల బారిన అతడు ఇక జట్టులోకి రావడం కష్టమే అన్నారు. సరిగ్గా టీమిండియాలో చోటు కోల్పోయిన కొద్దిరోజులకే ఐపీఎల్-15 రిటెన్షన్స్ జరిగాయి. ఆరేండ్లుగా ముంబై ఇండియన్స్ తో ఉన్న పాండ్యా ను ముంబై రిటైన్ చేసుకోలేదు. అతడి తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ను రిటైన్ చేసుకుందే తప్ప పాండ్యాను పట్టించుకోలేదు.
రిటైన్ చేసుకోకున్నా కనీసం వేలంలో అయినా దక్కించుకుంటామని గ్యారెంటీ ఇవ్వలేదు. ఫామ్ కోల్పోయిన అతడు.. తిరిగి గాయం నుంచి కోలుకోవడం కూడా కష్టమేనని.. అతడిని తీసుకోవడం కూడా వృథా ఖర్చు అని ముంబై యాజమాన్యం భావించిందని గతంలో వార్తలు కూడా వచ్చాయి.
ఇక ముంబైకి పాండ్యా రాం రాం చెప్పేసినట్టే అని వార్తల నేపథ్యంలో స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా తాను ముంబై కి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించేశాడు. అదే సమయంలో ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. పాండ్యాను సంప్రదించి అతడిని కెప్టెన్ గా నియమించింది.
గుజరాత్ కు కెప్టెన్ గా చేయడానికంటే ముందు హార్ధిక్ కు సారథిగా అనుభవం లేదు. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా ఏదో తమవాడు (హార్ధిక్ ది గుజరాత్), సొంత ఫీలింగ్ కలిసివస్తుందని అనుకుందే తప్ప అతడేదో అద్భుతాలు చేస్తాడని సీవీసీ క్యాపిటల్స్ (గుజరాత్ యాజమాన్యం) కూడా ఊహించి ఉండదు.
వేలంలో ఆ జట్టు ఎంచుకున్న జట్టును చూసినా.. వాళ్ల గత రికార్డులు చూసినా గుజరాత్.. ప్లేఆఫ్స్ కు వెళ్తే మహా గొప్ప అనుకున్నారు. హార్ధిక్ మీద నైతే అసలు ఎవరికీ అంచనాలే లేవు.
కానీ, పాండ్యా అద్భుతమే చేశాడు. తనకు ఉన్న వనరులతో ఐపీఎల్ లో దిగ్గజాలను ఢీకొడుతూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయాడు. జట్టులో సమిష్టితత్వాన్ని నింపడంలో కీలక పాత్ర పోషించాడు. తన మాజీ కెప్టెన్ ధోని నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న పాండ్యా.. ఎక్కడా చిరునవ్వు చెదరకుండా.. జూనియర్ మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు.
Photo source- iplt20.com
ఈ సీజన్ మొత్తమ్మీద హార్ధిక్ మ్యాచ్ లో ఒత్తిడి ఎదురైనప్పుడు గానీ.. కీలక సమయాల్లో గానీ కోప్పడ్డ సందర్భాలు చాలా అరుదు. తాను ప్రశాంతంగా ఉండటమే గాక తన ఆటగాళ్లను కూడా అదే విధంగా నడిపించాడు.. ఈ సీజన్ లో గుజరాత్ రెండో సారి బ్యాటింగ్ చేసి విజయం సాధించిన సందర్భాలు 8. వాటిలో దాదాపు ఎక్కువమ్యాచులు చివరి ఓవర్లో విజయం సాధించనవే. ఈ మ్యాచులన్నింటిలో గుజరాత్ ఆటగాళ్లలో ఒత్తిడి అనేదే కనిపించలేదు.
ఆటగాళ్లలో సమిష్టితత్వం నింపడంలో పాండ్యా కీలక భూమిక పోషించాడు. సీజన్ కు ప్రారంభానికి ముందే పాండ్యా.. ‘గెలుపు అయితే మీది.. ఓటమి అయితే నాది..’అని తన సహచరులతో చెప్పాడు. ఇక సీజన్ మధ్యలో ఓసారి రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఈ జట్టులో నేను కెప్టెన్ కాదు. ప్రతి ఒక్కరూ సారథే. మన టీమ్ లో హైరార్కీ (పై నుంచి కిందకు) ఏమీ లేదు. అందరూ సమానమే అని పాండ్యా చెబుతుంటాడు’ అని చెప్పాడంటే పాండ్యా గుజరాత్ ఆటగాళ్లకు ఏ మేరకు స్వేచ్ఛనిచ్చాడో అర్థం చేసుకోవచ్చు.
కెప్టెన్ గా ఉండి నీతులు చెబుతానంటే కుదరదు. జట్టు ఆడాలంటే, సమిష్టిగా రాణించాలంటే నాయకుడు కూడా ముందుండి నడిపించాలి. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన పాండ్యా.. ఈ సీజన్ లో నిలకడగా రాణించాడు. ఐపీఎల్-15 లో గుజరాత్ తరఫున అత్యధిక స్కోరు (15 మ్యాచుల్లో 487) చేసింది పాండ్యానే కావడం గమనార్హం.
Image credit: PTI
ఓపెనర్ గా గిల్ తో కలిసి సాహా ను పంపడం.. మిల్లర్, తెవాటియా లను ఫినిషర్ లుగా ఉపయోగించుకోవడం మొదలు ప్రతి విభాగంలో పాండ్యా తనదైన మార్కును చూపించాడు.
మిస్టర్ కూల్ కెప్టెన్ కు డబుల్ కూల్ వంటి ఆశిష్ నెహ్రా జతకలిశాడు. ఇంకేం..? సాధారణంగా హెడ్ కోచ్ లంటే పేపర్లు, పెన్నులు పట్టుకుని కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని బుర్ర పీక్కుంటారు. తర్వాత ఓవర్ ఎలా వేయాలి..? తర్వాత ఏ బ్యాటర్ ను పంపాలి..? ప్రత్యర్థిని కట్టడి చేయడానికి ఏం వ్యూహం రచించాలి..? అని నానా హంగామా చేస్తారు. కానీ ఈ సీజన్ మొత్తమ్మీద నెహ్రాను మనం అలా చూసి ఉండం..
సాధాసీదాగా ఓ చిన్న షార్ట్ వేసుకుని.. బ్యాక్ క్యాప్ పెట్టుకుని.. బౌండరీ వద్ద నిల్చుని కొబ్బరి బోండాం తాగుతూ హాయిగా మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుడిలా కనిపించాడే గానీ.. ఏం హంగామా చేయలేదు. తాను ప్రశాంతంగా ఉండి జట్టును కూడా అదే మంత్రాన్ని జపించేలా చేశాడు. గుజరాత్ టైటాన్స్ విజయాలలో ఈ ఇద్దరిదే కీలక పాత్ర అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు.
పాండ్యా తాజా ప్రదర్శనపై అతడిని ఐపీఎల్ - 15 సీజన్ కు ముందు తిట్టినోళ్లే వేనోళ్ల పొగుడుతున్నారు. ఇన్నాళ్లు టీమ్ కు పనికిరాడన్న వాళ్లే ఇప్పుడు ఏకంగా టీమిండియాకు కూడా కెప్టెన్ చేయాలని అంటున్నారు. బౌలింగ్ చేయడం లేదు, ఆల్ రౌండర్ ఎలా అవుతాడు..? అన్నోళ్లే ఇప్పుడు అదే కోటాలో అతడు తిరిగి భారత జట్టుకు రావడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయమంటే ఇదేనేమో..? మనను విమర్శించినోళ్లే కీర్తిస్తుండటం కంటే గొప్ప విజయం ఏముంటుంది..?