పిచ్ మారింది, ముంబై ఇండియన్స్ ఫామ్లోకి వచ్చింది... రాజస్థాన్ రాయల్స్కి మరో ఓటమి...
చెన్నై స్టేడియంలో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీలో ఆడిన మొదటి మ్యాచ్లో అద్భుతమైన విజయంతో కమ్బ్యాక్ ఇచ్చింది. రాజస్థాన రాయల్స్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ముంబై ఇండియన్స్, లీగ్లో మూడో విజయాన్ని అందుకుంది.
రోహిత్ శర్మ, డి కాక్ కలిసి మొదటి వికెట్కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 17 బంతుల్లో ఓ సిక్సర్తో 14 పరుగులు చేసిన రోహిత్ శర్మ, క్రిస్ మోరిస్ బౌలింగ్లో చేతన్ సకారియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్లో జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
టూ డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి... ముస్తాఫిజుర్ బౌలింగ్లో బౌల్ట్ అయ్యాడు. అయితే కృనాల్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికే ముంబై విజయానికి అతిచేరువగా వచ్చేసింది.
గత నాలుగు మ్యాచుల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయిన క్వింటన్ డి కాక్ అద్భుతంగా చెలరేగాడు. డి కాక్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా పోలార్డ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 16 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించాడు.
ఆరు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్ మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ఆరింట్లో నాలుగు మ్యాచులు ఓడిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.