ధోనీ ట్రెండ్ సెట్టర్: ఏడు అద్భుత ప్రదర్శనలు ఇవీ....
వన్డే క్రికెట్లో ధోనిది చెరగని సంతకం. విధ్వంసకారుడి నుంచి విజయవంతమైన ఫినీషర్ వరకు ప్రపంచ క్రికెట్ అభిమానులు మరిచిపోలేని ఏడు అద్భుత ఇన్నింగ్స్లను ఓసారి చూద్దాం.
వన్డే క్రికెట్ ఆల్టైమ్ గ్రేట్ ఫినీషర్, భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎం.ఎస్ ధోని అప్రతిహత విజయాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు శనివారమే తెరదించాడు. మహేంద్రసింగ్ ధోని అనగానే జులపాల జుట్టు కుర్రాడు, గొప్ప మ్యాచ్ ఫినీషర్, సూపర్ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ క్రికెటర్ మాత్రమే కాదు అంతకుమించి!. 2004లో భారత జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో పించ్ హిట్టర్గా, విధ్వంసకారుడిగా అభిమానులకు మహి సుపరిచితుడు.
నాయకత్వ పగ్గాలు ధోని శైలిని మార్చివేసింది. సారథ్యం అతడిలో బాధ్యత పెంచింది. టెస్టు క్రికెట్లో ధోని తనదైన ముద్ర వేయలేకపోయినా.. వన్డే క్రికెట్లో ధోనిది చెరగని సంతకం. విధ్వంసకారుడి నుంచి విజయవంతమైన ఫినీషర్ వరకు ప్రపంచ క్రికెట్ అభిమానులు మరిచిపోలేని ఏడు అద్భుత ఇన్నింగ్స్లను ఓసారి చూద్దాం.
శ్రీలంకపై 91 నాటౌట్, 2011 వరల్డ్కప్ ఫైనల్ :
ముంబయి వాంఖడేలో 2011 వరల్డ్కప్ ఫైనల్. భారత్ 114/3తో కష్టాల్లో పడింది, 275 పరుగుల ఛేదనలో సాధించాల్సిన రన్రేట్ 6కు చేరువైంది. ఈ సమయంలో ఫామ్లో ఉన్న యువరాజ్ సింగ్ను కాదని, ఎం.ఎస్ ధోని బ్యాటింగ్కు వచ్చాడు.
ఫైనల్స్కు ముందు వరల్డ్కప్లో ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి ధోని 150 పరుగులు మాత్రమే చేశాడు. డ్రెస్సింగ్రూమ్లో కోచ్ గ్యారీ కిర్స్టన్ వద్దకు వెళ్లి, తర్వాత నేను వెళ్తానని చెప్పాడు. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ను ఎదుర్కొవటం యువరాజ్ సింగ్కు ఇబ్బంది అని ధోని తనే వెళ్లాడు. కెరీర్ భీకర్ ఫామ్లోనూ యువీ నాణ్యమైన స్పిన్ను ఎదుర్కొవటంలో తడబడ్డాడు.
చెన్నై సూపర్కింగ్స్ నెట్స్లో మురళీధరన్ అస్త్రాలను ఎదుర్కొన్న ధోని ఆ నమ్మకంతోనే వెళ్లాడు. క్రీజులోకి వెళ్లిన ఎంతో సమయానికి గానీ ధోని బౌండరీ కొట్టలేదు. గంభీర్ ముందుండి నడిపిస్తున్నాడు.
మురళీధరన్ 22 బంతుల్లో 22 పరుగులు చేసిన ధోని.. తిశార పెరీరా వేసిన బంతిని స్టేడియం పైకప్పుపైకి పంపించాడు. సాధించాల్సిన రన్రేట్, శ్రీలంక బౌలర్లపై దాడి ధోని దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన సమయమది. నువాన్ కులశేఖర బంతిని లాంగ్ఆన్లో సిక్సర్గా మలిచి, తనదైన శైలిలో ముగించాడు. 28 ఏండ్ల వరల్డ్కప్ నిరీక్షణకు తెరదించాడు. ధోని ఫినీషింగ్ సిక్సర్ ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుత ఘట్టం!.
పాకిస్థాన్పై 148, వైజాగ్ 2005 :
దిగ్గజ ధోని రూపుదిద్దుకుంటున్న సమయం. పాకిస్థాన్తో విశాఖతీరంలో వన్డే మ్యాచ్. మహికి అది ఐదో వన్డే ఇన్నింగ్సే. జులపాల జుట్టు కుర్రాడు పించ్ హిట్టర్గా నం.3 పొజిషన్లో వచ్చాడు. సచిన్ 2 పరుగులకు రనౌట్ కావటంతో సెహ్వాగ్తో జతకలిశాడు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోని టాప్ ఆర్డర్లో దింపాడు.
పదేపదే గ్లౌవ్స్ సరిచేసుకుంటూ, పాకిస్థాన్ సీమర్లను సెహ్వాగ్ తరహాలోనే పాయింట్ దిశగా బౌండరీలు బాదటం మొదలుపెట్టాడు. అబ్దుల్ రజాక్ను పాయింట్ దిశగా.. మహ్మద్ సమి, నవీద్ ఉల్ హసన్ను ఎక్స్ట్రా కవర్ ఆఫ్ దిశగా ముందుకొచ్చి బాదాడు.
షాహిద్ ఆఫ్రిదిని సైతం మహి వదల్లేదు. 88 బంతులో కెరీర్ తొలి వన్డే శతకం సాధించిన ధోని అమ్ములపొదిలోని అస్త్రాలను అన్నింటిని చూపించాడు. స్కూప్స్, స్వీప్స్, భారీ షాట్లతో విశాఖను హౌరెత్తించాడు. ఏం జరుగుతుందో తెలిసోలోపే వీరూతో కలిసి ధోని పాకిస్థాన్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ ఇన్నింగ్స్తోనే ప్రపంచ క్రికెట్కు ధోని ఘనంగా పరిచయమయ్యాడు.
శ్రీలంకపై 183, జైపూర్ 2005 :
ఆరు నెలల తర్వాత నం.3 పొజిషన్లో ధోని మరోసారి విశ్వరూపం చూపించాడు. సచిన్ టెండూల్కర్ త్వరగా ఔటైన వేళ 299 పరుగుల భారీ ఛేదనలో ధోని టాప్ ఆర్డర్లో వచ్చాడు. పించ్ హిట్టర్కు మించి తనలో సత్తా ఉందని ధోని నిరూపించాడు.
భారీ ఛేదనలో అద్భుతమైన బ్యాటింగ్ విధ్వంసంతో సచిన్ షార్జా తుఫాన్ ఇన్నింగ్స్ను తలపించాడు. 145 బంతుల్లో అజేయ 183 పరుగులే వికెట్ కీపర్ బ్యాట్స్మన్కు అత్యధిక స్కోరు.
చమిందా వాస్పై ఎక్స్ కవర్స్లో సిక్సర్ల వర్షంతో మొదలైన ఊచకోత..మురళీధరన్ దూస్రాను దంచేవరకు కొనసాగింది. 40 బంతుల్లో తొలి 50, 45 బంతుల్లో మలి 50 బాదిన ధోని.. 150 మార్క్ అందుకునేందుకు మరో 38 బంతులే వాడాడు. 183 పరుగుల ఇన్నింగ్స్లో 120 పరుగులు బౌండరీల రూపంలో వచ్చినవే. సిక్సర్తో ఛేదనను పూర్తి చేసిన ధోని.. స్టాండ్స్లోకి బంతిని పంపి ముగించటం ఇక్కడి నుంచి సంప్రదాయమైంది!.
పాకిస్థాన్పై 72, లాహౌర్ 2006 :
ఐదు మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. షోయబ్ మాలిక్ శతకంతో పాక్ తొలుత 288 పరుగులు చేసింది. ధోని క్రీజులోకి వచ్చేసరికి భారత్ 90 బంతుల్లో 90 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మహ్మద్ అసిఫ్, ఉమర్ గుల్లతో కూడిన పాక్ పేస్ దళంపై ఇది కష్టమైన సమీకరణమే.
యువరాజ్తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేసిన ధోని.. తనే 46 బంతుల్లో 72 పరుగులు పిండుకున్నాడు. పాక్ సీమర్లు బాడీపైకి బంతులేయగా.. ధోని ఒంపుగా పరుగులు కొట్టాడు.
18 బంతుల్లో 20 పరుగుల నుంచి 35 బంతుల్లో అర్ధ సెంచరీకి దూసుకెళ్లాడు. కండ్లుచెదిరే హిట్టింగ్తో పాక్ బౌలర్లతో ఆటాడుకున్న ధోని.. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను సైతం ఆకట్టుకున్నది ఈ ఇన్నింగ్స్తోనే కావటం విశేషం.
పాకిస్థాన్పై 113, చెన్నై 2012 :
పాక్ సీమర్లు స్వింగ్ బంతులతో టీమ్ ఇండియా టాప్-4 బ్యాట్స్మెన్ను పెవిలియన్కు చేర్చారు. రోహిత్ శర్మ, సురేశ్ రైనా సైతం ఎంతోసేపు వికెట్ నిలుపుకోలేదు. భారత్ పీకల్లోతు ఒత్తిడిలో పడింది.
చెన్నై స్టార్స్ ఇద్దరూ.... ధోని, అశ్విన్లు 125 పరుగుల భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టు ఆశలు నిలబెట్టారు. 29/5 నుంచి ధోని భారత్ను 227/6కు తీసుకెళ్లాడు. ఆ ఇన్నింగ్స్లో పది డబుల్ రన్స్, ఓసారి మూడు పరుగులు, 40 సింగిల్స్ తీశాడు. ఇన్నింగ్స్ తర్వాత ధోని నిలబడేందుకు సైతం ఇబ్బందిపడ్డాడు.
అశ్విన్తో కలిసి ఏడో వికెట్కు అభేధ్యమైన భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టినా.. ధోని శతకం గెలుపుకు సరిపోలేదు. పాక్ 228 పరుగులను మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది.
ఆస్ట్రేలియాపై 44, ఆడిలైడ్ 2012 :
2011 వరల్డ్కప్ ఫైనల్స్ ఛేదనను పోలిన మ్యాచ్ వంటిది. ఛేదనలో సెహ్వాగ్, విరాట్ కోహ్లి, గౌతం గంభీర్లు మెరిశారు. 270 పరుగుల ఛేదనలో 35వ ఓవర్కు భారత్ 178/4 వద్ద నిలిచింది.
సురేశ్ రైనాతో కలిసి ధోని 72 బంతుల్లో 61 పరుగులు జోడించాడు. ఆఖరి ఓవర్లో భారత్కు 13 పరుగులు అవసరమయ్యాయి. నాలుగు బంతుల్లో 12 పరుగులకు సమీకరణం చేరుకుంది.
ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు రావాల్సింది కాదని గంభీర్ ఇటీవల అన్నాడు. కానీ ధోని ఛేదనలను ఇదే తరహాలో ముగిస్తాడనే సంగతి తెలిసిందే. మెక్కే వేసిన ఆఖరి ఓవర్లో ధోని మూడో బంతిని 112 మీటర్ల సిక్సర్గా మలిచాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు మహి. ఎం.ఎస్ ధోని తనదైన శైలిలో ముగించిన మ్యాచులలో ఇదొకటి.
శ్రీలంకపై 45, 2013 పోర్ట్ఆఫ్ స్పెయిన్ :
ముక్కోణపు సిరీస్ ఫైనల్స్ లక్ష్యం. శ్రీలంకతో భారత్ మ్యాచ్. షమిద ఎరంగ టాప్ ఆర్డర్ను కకావికలం చేయగా, రంగన హెరాత్ మిడిల్ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓ బంతి బౌన్స్ కాగా, మరో బంతి స్పిన్ అవుతూ మ్యాజిక్ చేస్తున్నాయి. అనిశ్చితి నెలకొంది.
ఈ సమయంలో రిస్క్ ఫ్రీ దూకుడుతో ధోని భారత్ను రేసులో నిలిపాడు. 202 పరుగుల ఛేదనలో సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, వినరు కుమార్లు పెవిలియన్కు చేరారు. ఆఖరు ఓవర్ సమీకరణం 15 పరుగులు. తొలి బంతి భారీ హిట్ నుంచి మిస్ అయ్యింది. ఆఖరు బ్యాట్స్మన్ తోడుగా ధోని.. ఎరంగపై విరుచుకుపడ్డాడు. ఎరంగపై తల మీదుగా భారీ సిక్సర్ సంధించిన ధోని వ్యాఖ్యాతలకు పెద్ద పని పెట్టలేదు. సిక్సర్తోనే తనదైన శైలిలోనే మహి మ్యాచ్ను ముగించాడు.