INDvsAUS: ఆసీస్ టూర్కి సిరాజ్, శార్దూల్, అక్షర్ పటేల్... వచ్చే వారం జట్టు ఎంపిక...
IPL 2020 కారణంగా ఆరు నెలల తర్వాత క్రికెట్ పండగ మళ్లీ మొదలైంది. కరోనా బ్రేక్ తర్వాత ఆలస్యంగా మొదలైనా ఐపీఎల్, క్రికెట్ ఫ్యాన్స్కి కావాల్సినంత మజాను అందిస్తోంది. దీంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత యథావిథిగా క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది.
నవంబర్లో ఐపీఎల్ ముగిసిన తర్వాత నెల రోజులకి ఆస్ట్రేలియాకి బయలుదేరి వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు...
డిసెంబర్ 3 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ టూర్లో నాలుగు టెస్టు మ్యాచులతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది భారత జట్టు...
అయితే ఐపీఎల్లో భారత సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ గాయపడ్డారు. ఈ ఇద్దరూ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు వైద్యులు.
దీంతో ఆసీస్ టూర్కి భువీ, ఇషాంత్ శర్మ దూరం కానున్నారు. వీరి స్థానంలో నవ్దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకోబోతున్నట్టు సమాచారం.
హైదరాబాద్కి చెందిన సిరాజ్... ఇప్పటిదాకా భారత జట్టు తరుపున ఒక వన్డే, 3 టీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు.
రంజీ ట్రోఫీలో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించడంతో అతని టెస్టు జట్టులోకి ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు సెలక్టర్లు...
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కూడా టెస్టులో అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారత జట్టు తరుపున 10 వన్డేలు, 15 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడిన శార్దూల్ ఠాకూర్... విండీస్పై ఆడిన మొదటి టెస్టులో నరాలు పట్టేయడంతో 10 బంతులు మాత్రమే వేయగలిగాడు.
కోల్కత్తా నైట్రైడర్స్ తరుపున ఆడుతున్న శివమ్ మావి కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
స్పిన్నర్ స్థానంలో యంగ్ బౌలర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వస్తాడని టాక్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కుల్దీప్ యాదవ్లతో అక్షర్ పటేల్ స్పిన్ విభాగంలో బంతిని షేర్ చేసుకోబోతున్నాడు.
ఈ టూర్కి విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహారిస్తుంటే... వన్డేల్లో రోహిత్ శర్మ, టెస్టుల్లో అజింకా రహానే వైస్ కెప్టెన్లుగా వ్యవహారించబోతున్నారు.
టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్లో ఉంటే... భారత జట్టు మూడో స్థానంలో ఉంది. వన్డేలో భారత జట్టు రెండో స్థానంలో ఉంటే, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ఈ సిరీస్ ఫలితాలను బట్టి రెండు జట్ల ర్యాంకులు మారనున్నాయి.