కెప్టెన్సీని కోహ్లి తన వైఫల్యంగా చూస్తాడు.. అందరికీ ఘనమైన ముగింపు కుదరదు.. విరాట్ పై సీనియర్ల కామెంట్స్
IPL2021: సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ Virat Kohli పై పలువురు సీనియర్లు స్పందిస్తున్నారు. ఇదే విషయమై సునీల్ గవాస్కర్ తో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కామెంట్స్ చేశారు.
ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో విరాట్ సారథ్యంలోని Royal challengers banglore పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.. కోహ్లి సారథ్యంపై కామెంట్స్ చేశారు. ఐపీఎల్ కెప్టెన్సీని కోహ్లి తన వైఫల్యంగా చూస్తాడని వాన్ వ్యాఖ్యానించాడు.
వాన్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ వంటి హైలెవల్ స్పోర్ట్స్ లో ట్రోఫీలను గెలవడాన్నే చూస్తారు. ప్రత్యేకించి కోహ్లి వంటి అత్యుత్తమ స్థాయి ఆటగాడి స్థాయిలో ఉన్నప్పుడు అంచనాలు భారీస్థాయిలో ఉంటాయి. భవిష్యత్ లో కోహ్లి.. ఐపీఎల్ కెప్టెన్సీని తన వైఫల్యంగా చూస్తాడు.
తన నాయకత్వంలో RCB ట్రోఫీ నెగ్గకపోవడం కోహ్లిని వెంటాడే విషయం. కానీ ఐపీఎల్ పక్కనబెడితే.. టెస్టులు, వన్డేలలో భారత్ ను అతడు అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాడు.
ముఖ్యంగా టెస్టు మ్యాచ్ లలో అతడి అంకితభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటితో పోల్చుకుంటే ఐపీఎల్ చాలా చిన్నది. కోహ్లి దాని నుంచి చాలా దూరం వెళ్లాడు’ అని వాన్ అన్నాడు.
ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పటిష్టంగా ఉన్నదని వాన్ చెప్పాడు. ఈసారి ఆ జట్టులో బ్యాటింగ్ విభాగంలో మ్యాక్స్వెల్ , పడిక్కల్ వంటి వాళ్లు..బౌలింగ్ లో చాహల్, హర్షల్ వంటి ఆటగాళ్లు మెరుగ్గా రాణించాడని వాన్ తెలిపాడు.
ఇక ఆర్సీబీ పరాజయంపై సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. ఆటలో ప్రతి ఒక్కరూ ఘనమైన ముగింపు ఇవ్వాలని కోరుకుంటారని, కానీ అన్నీమనం అనుకున్నట్టు జరుగవని అన్నాడు. టోర్నీ నుంచి ఆర్సీబీ ఇలా నిష్క్రమించడం నిరాశ కలిగించేదేనని చెప్పాడు.
‘ఆటలో అన్ని విషయాలు మనం అనుకున్నట్టు జరుగవు. ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్ కెరీర్ లో వంద సగటు సాధించడానికి చివరి మ్యాచ్ లో నాలుగు పరుగులే అవసరమయ్యాయి. కానీ అందులోనే బ్రాడ్మన్ డకౌట్ అయ్యాడు’ అని సన్నీ అన్నాడు.
అంతేగాక సచిన్ టెండూల్కర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని గవాస్కర్ చెప్పాడు. తన 200వ టెస్టులో సెంచరీ చేసి ముగించాలని సచిన్ భావించాడు. కానీ 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఎప్పుడూ మనం ఊహించినట్టు జరుగదు. అందరికీ ఘనమైన ముగింపు ఇవ్వాలంటే కుదరదు. కోహ్లి విషయంలో ఇదే జరిగిందని గవావస్కర్ పేర్కొన్నాడు.
కాగా, ఈ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లి నిష్క్రమించనున్న విషయం తెలిసిందే. ఆర్సీబీతో పాటు త్వరలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా కోహ్లి.. భారత టీ20 కెప్టెన్ గా వైదొలగనున్నాడు.